ఆఫ్ఘనిస్థాన్ ఆక్రమణకు ముందు తాలిబన్లు తమ అరాచకాలతో భయానక వాతావరణం సృష్టించారు. ఆఫ్ఘన్ పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు. మహిళలపై కఠిన ఆంక్షలు విధించి.. ఇండ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పొరపాటున బయటకు వచ్చిన మహిళలపై దాడులు చేశారు. అంతే కాదు.. చిన్న పిల్లలు అని చూడకుండా వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. అలా తాలిబన్ల దాడిలో ఓ ఎనిమిదేండ్ల బాలిక తన కాలును కోల్పోయింది. ఎన్నో అరాచకాలు సృష్టించి.. మొత్తానికి ఆఫ్ఘన్ను తాలిబన్లు స్వాధీన పరుచుకున్నారు. తాలిబన్ల పాలనలో మహిళల హక్కుల పరిస్థితి ఏంటి అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాలిబన్ల దాడిలో నాలుగు నెలల క్రితం ఓ ఎనిమిదేండ్ల బాలిక తన ఎడమ కాలును కోల్పోయింది. ప్రస్తుతం కృత్రిమ కాలుతో నడవగలుగుతోంది ఆ పాప. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు చెందిన రోగ్జానా సబేరి.. చిన్నారి షరిఫాను పలుకరించింది. నాలుగు నెలల క్రితం తమ గ్రామంలో తాలిబన్లు చేసిన దాడుల్లో నా కాలును కోల్పోయాను. కానీ కాలు విరిగిందన్న బాధ నాకు ఇప్పుడు లేదు. మేము స్కూల్కు వెళ్లేందుకు అనుమతించడం లేదు.. దానికి భయమేస్తుంది. నాకు డాక్టర్ కావాలనే కోరిక ఉంది. ఆ కల నెరవేరుతుందో లేదో అని దిగాలుగా ఉంది అని షరీఫా చెప్పుకొచ్చింది.
కాందహార్లో బాలికలను ఎడ్యుకేట్ చేస్తున్న పస్థానా దురానీని తాలిబన్ల దాడి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దురానీని కూడా సబేరి పలుకరించింది. ఇప్పుడు తాలిబన్లు మిమ్మల్ని గుర్తిస్తే.. మీకు ఏమవుతుందని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. వారు నన్ను చంపుతారని అనుకోవడం లేదు. అయితే తామంతా ఒకే దేశానికి చెందిన వ్యక్తులమని అంగీకరిస్తే బాగుండు. ఇది నిజమే కదా? అని దురానీ అన్నారు. తాను షరీఫా అనే చిన్నారిని కలిసినప్పుడు డాక్టర్ కావాలనే కోరిక ఉంది. కానీ స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఆమె భవిష్యత్ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారని దురానీని సబేరి అడిగింది. డాక్టర్ కావాలనుకున్న ఆ అమ్మాయితో సహా మిగతా అమ్మాయిల భవిష్యత్ గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. తాలిబన్ల పాలనలో అమ్మాయిలు పాఠశాలలకు వెళ్తారా? అది సాధ్యమవుతుందా? అని దురానీ ప్రశ్నించారు. అమ్మాయిలకు మంచి భవిష్యత్ ఉంటుందని తాను అనుకోవడం లేదని దురానీ పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గతంలో తాలిబన్లు సాగించిన అరాచకాలు మరోసారి రిపీట్ అయే ప్రమాదం కనిపిస్తోంది. 1996-2001 వరకు తాలిబన్లు ఆఫ్గన్ను ఏలిన కాలంలో స్త్రీలను దారుణంగా అణచివేశారు. వారికి విద్య,ఉద్యోగాలపై నిషేధం విధించారు. మగ తోడు లేకుండా బయటకు రావొద్దని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత తాలిబన్ల పాలనలో స్త్రీల హక్కులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
షరియా చట్టాలకు లోబడి స్త్రీల హక్కులు ఉంటాయని తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యతో పాటు ఎడ్యుకేషన్, హెల్త్, తదితర రంగాల్లో స్త్రీలు ఉద్యోగాలు చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. కానీ తాజా పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగానే ఉన్నాయి. దీంతో ఆఫ్గనిస్తాన్లోని స్త్రీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.