కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని 31 ప్రావిన్సుల్లో అధికారులు నైట్ కర్ఫ్యూ విధించారు. తాలిబాన్ ఉగ్రవాదుల హింసాకాండను అరికట్టే ప్రయత్నంలో భాగంగా ఆఫ్ఘాన్ అధికారులు శనివారం దేశంలోని 31 ప్రావిన్సులలో నైట్ కర్ఫ్యూ విధించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రజలు తమ ఇళ్లను విడిచి బయటకి వచ్చేందుకు అనుమతి నిరాకరణ. కాబూల్, తూర్పు నంగర్హార్ ప్రావిన్స్, ఉత్తర పంజ్షెర్ ప్రావిన్సులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపును ఇచ్చినట్లు ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా రాత్రి సమయంలోనే జరుగుతుంటాయని కావునా ఇటువంటి చర్యలు వారిని పరిమితం చేసేందుకు దారితీస్తాయన్నారు.
మొత్తం 31 ప్రావిన్సులలోని ప్రజలు నైట్ కర్ఫ్యూను పాటిస్తూ భద్రతా దళాలతో సహకరించాల్సిందిగా ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల శాఖ డిప్యూటీ ప్రతినిధి అహ్మద్ జియా జియా కోరారు. ఇటీవలి కాలంలో తాలిబాన్ ఉగ్రవాద దాడులు ఎక్కువయ్యాయి. గత నాలుగు నెలల్లో దేశంలో 36 వేలకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. యుద్ధం కొనసాగితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.