కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ‘యాక్టింగ్’ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ తజికిస్థాన్కు పారిపోయారు. తాలిబన్ల సెగ పెరుగుతున్న నేపథ్యంలో పంజ్షీర్ కమాండర్లతో కలిసి గురువారం రెండు విమానాల్లో దేశాన్ని వీడినట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. తాలిబాన్లకు వ్యతిరేకంగా పంజ్షీర్లోని ప్రతిఘటన దళాలు ఆఫ్ఘన్ పౌరుల హక్కులను కాపాడుతాయని పేర్కొన్న ఒక రోజు తర్వాత ఆయన ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారిపోయినట్లు వార్తలొచ్చాయి.
మరోవైపు దేశం నుండి నిష్క్రమించిన తర్వాత సలేహ్ శుక్రవారం ఒక ట్వీట్ చేశారు. పంజ్షీర్ ప్రజల బాధాకరమైన అనుభవాలను ఆయన హైలైట్ చేశారు. ‘తాలిబ్లు పంజ్షీర్కి మానవతా సహాయాన్ని నిరోధించారు. పంజ్షీర్ సైనిక వృద్ధులను మైన్ క్లియరెన్స్కు వినియోగించుకున్నారు. ఫోన్, విద్యుత్ సౌకర్యాలను నిలిపివేశారు. ఔషధాలను కూడా అనుమతించడం లేదు. ప్రజలు కొంత మొత్తంలో మాత్రమే నగదు తీసుకెళ్లగలుగుతున్నారు’ అని పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్థాన్లో ఎమర్జెన్సీ ప్రారంభమైనప్పటి నుండి గత 23 సంవత్సరాలుగా తాలిబ్ యాక్సెస్ని తాము ఎన్నడూ నిరోధించలేదని అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు. తాలిబ్లు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని, ఐహెచ్ఎల్పై వారికి ఎలాంటి గౌరవం లేదని ఆరోపించారు. ఈ స్పష్టమైన నేరాలు, తీవ్రవాద ప్రవర్తనను గమనించాలని ఐరాస, ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నామని ట్వీట్ చేశారు.