హైదరాబాద్ : దేశంలో కేంద్రం నుంచి అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణనే అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్నిరాష్ట్రాల ఆర్థిక లోటు 36.3 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటు 23.10 శాతంగా ఉందని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిందని, ఖర్చులు అధికంగా పెరిగాయని పేర్నొన్నారు. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ప్రజారోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నదని మంత్రి తెలిపారు.
ఈ పరిస్థితుల్లో ఎఫ్ఆర్బీఎం పరిధిని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఐజీఎస్టీ నిధులు గతేడాది రూ. 2,638 కోట్లు వచ్చాయని వెల్లడించారు. ఈ ఏడాది ఐజీఎస్టీ నిధులు రూ. 13 వేల కోట్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 218 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు బాగాలేకపోవడం, పరిహారం ఇచ్చేందుకు ఇదే చివరి ఏడాది అయినందున పూర్తి పరిహారం చెల్లించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సభ్యత్వం ఇవ్వాలని హరీశ్ రావు కోరారు.
న్యూట్రల్ ఆల్కహాల్ను జీఎస్టీ నుంచి మినహాయించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రమేనని అన్నారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోంది సెస్, సర్ ఛార్జీల రూపంలోనేనని గుర్తుచేశారు. గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూలో 18శాతం సర్ ఛార్జీ, సెస్ల రూపంలో వచ్చిందేనని అన్నారు.
కేంద్రం వసూలు చేస్తున్న సెస్లు, సర్ ఛార్జీల ద్వారా రాష్ట్రాలు 41 శాతం ఆదాయం కోల్పోతున్నాయని తెలిపారు. తెలంగాణ యేటా రూ.3439 కోట్ల ఆదాయం కోల్పోతుందని చెప్పారు. అన్నిరాష్ట్రాల మంత్రులు కోరుతున్నట్లు జీఎస్టీ నుంచి ఆల్కహాల్ను మినహాయించాలని కోరారు. న్యూట్రల్ ఆల్కహాల్ను జీఎస్టీ పరిధి నుంచి శాశ్వతంగా మినహాయించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.