చొప్పదండి, జూలై 10: హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మంగళపల్లిలో సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా చొప్పదండి-మంగళపల్లి రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్ల్లాడుతూ, హరితహారం ఆరు విడుతల్లో నాటిన మొక్కలు పెరిగి గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. ఏడో విడుతలో సైతం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు. నాటిన ప్రతి మొక్కనూ బతికించుకున్నప్పుడే గ్రామం పచ్చదనంతో కళకళలాడుతుందని అన్నారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ లచ్చయ్య, ఎంపీటీసీ వెల్మ విజయలక్ష్మి-శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, పీఆర్ ఏఈ విజయసారథి, ఐకేపీ ఏపీఎం నర్మద, ఉపసర్పంచ్ సురేశ్, నాయకులు ఏనుగు స్వామిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, కళ్లెం సంతోష్రెడ్డి పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితోనే అభివృద్ధి
చొప్పదండి, జూలై 10: పట్టణ ప్రగతితో పట్టణాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి పనులను ఆమె పరిశీలించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మురుగు కాలువలు, వీధులను శుభ్రం చేయించి, సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. 13వ వార్డులో వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్యతో కలిసి ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దండె కృష్ణ, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
చొప్పదండి, జూలై 10: గ్రామాలను శుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారని మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షణాధికారి వేణుగోపాల్ పేర్కొన్నారు. రాగంపేటలో పారిశుధ్య కార్మికులను, పంప్ ఆపరేటర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులను సన్మానించడం అభినందనీయమని అన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించాలని యజమానులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మామిడి లత-రాజేశం, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సింగిరెడ్డి కిష్టారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యులు శ్రీనివాస్, గజ్జెల శంకరయ్య, రాజేశ్వరి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
రామడుగు, జూలై 10: మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ సిబ్బందిని పాలకవర్గ సభ్యులు సన్మానించారు. వెదిర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామ ప్రత్యేకాధికారి రజినీ అందమైన ముగ్గులు వేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు కారోబార్ అశోక్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్, ఆర్ఐ రజినీ తదితరులను సర్పంచ్ తీగల సంగీత, వార్డు సభ్యులు శాలువాలతో సత్కరించారు. అనంతరం గ్రామసభ ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథులుగా ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సతీశ్రావు హాజరై మాట్లాడారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధిని కొనియాడారు. రంగశాయిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మండల ప్రత్యేకాధికారి రామారావు మాట్లాడుతూ, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు బాగున్నాయని సర్పంచ్ సాదు పద్మను అభినందించారు. అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి ముగింపు సందర్భంగా గ్రామసభలు ఏర్పాటు చేసి, చేపట్టిన పనులపై సమీక్షించారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రత్యేకాధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
గంగాధర, జూలై 10: గ్రామాల్లో పల్లె ప్రగతి పదో రోజూ గ్రామసభలు నిర్వహించి, ప్రణాళికల అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామాలు, డంప్ యార్డులు, కంపోస్టు షెడ్లను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. నర్సరీలను పరిశీలించారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించారు. మార్కెట్, ప్రధాన కూడళ్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించిన శుభ్రం చేశారు. మురుగు కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న కట్టడాలను తొలగించారు. గ్రామాల్లో విరిగిన స్తంభాలను తొలగించి, కొత్తవి ఏర్పాటు చేశారు. పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.