సెయింట్ పీటర్స్బర్గ్: రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ కోవిడ్ టీకాలు హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ టీకాల గురించి ఇవాళ సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్న భారతీయ దౌత్యాధికారి డీ బాలా వెంకటేశ్ వర్మ మాట్లాడారు. ఇప్పటికే ఇండియాకు ఓసారి లక్షన్నర, ఆ తర్వాత 60 వేల స్పుత్నిక్ టీకాలను పంపించినట్లు తెలిపారు. మే నెల చివరి నాటికి మొత్తం మూడు కోట్ల స్పుత్నిక్ టీకాలను సరఫరా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పంపిన టీకాలను ఇండియాలోనే బాటిళ్లలో నింపనున్నట్లు ఆయన చెప్పారు. ఇక జూన్ నెలలో టీకా డోసుల సంఖ్యను అయిదు కోట్లకు పెంచనున్నట్లు తెలిపారు. ఇండియాలో స్పుత్నిక్ టీకాల ఉత్పత్తి ఆగస్టులో స్టార్ట్ అవుతుందన్నారు.
భారత్లో మొత్తం 85 కోట్ల స్పుత్నిక్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు వెంటకటేశ్ వర్మ తెలిపారు. స్సుత్నిక్ ఉత్పత్తి చేస్తున్న టీకాల్లో.. 70 శాతం వరకు ఇండియాలోనే ఉత్పత్తి అవుతాయన్నారు. భారత్లో మూడు దశల్లో స్పుత్నిక్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. తొలుత రష్యా నుంచి టీకాలను సరఫరా చేస్తామని, అది ఇప్పటికే స్టార్ట్ అయ్యిందన్నారు. ఇక బల్క్లో ఇండియాకు ఆర్డీఐఎఫ్ టీకాలను పంపుతుందని, ఆ బల్ టీకాలను బాటిళ్లలో నింపాల్సి ఉంటుందన్నారు.
ఇక మూడవ దశలో.. రష్యా తన టెక్నాలజీని ఇండియన్ కంపెనీకి బదిలీ చేస్తుందన్నారు. ఆ తర్వాతే హైదరాబాద్లోని రెడ్డి ల్యాబ్స్ పూర్తి స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేస్తుందన్నారు. అయితే మూడు దశలు కలిపి ఇండియాలో మొత్తం 85 కోట్ల స్పుత్నిక్ టీకాలు ఉత్పత్తి అవుతాయన్నారు. స్పుత్నిక్ లైట్ టీకాలకు ఇంకా భారత్ నుంచి అనుమతి రాలేదని, రెండు దేశాల మధ్య సింగిల్ డోసు స్పుత్నిక్ లైట్ టీకా సహకారం కూడా ఉంటుందని వెంకటేశ్ వర్మ తెలిపారు.