కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ రక్షణశాఖ మంత్రి జనరల్ బిస్మల్లాహ్ మహ్మది ఇంటి వద్ద గత అర్ధరాత్రి కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారని, 20 మందికి గాయాలయ్యాయని ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. కాబూల్లోని షిర్పూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో 10 మంది ప్రభుత్వ ఉన్నతాధికారుల గృహసముదాయాలున్నాయి.
మహ్మది ఇంటి సమీపంలో కారు బాంబు పేలిన వెంటనే నలుగురు ముష్కరులు ఇంటి సమీపంలోకి వచ్చి భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. పేలుడు దాడికి షిర్పూర్ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. రక్షణశాఖ మంత్రి మహ్మది గెస్టుహౌజ్ లక్ష్యంగా చేసుకొని కారు బాంబు దాడి జరిగినట్లు తెలుస్తున్నది. పేలుడు సమయంలో మహ్మది ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. కొన్నివారాల క్రితమే ఆఫ్ఘనిస్థాన్ తమ భూభాగం నుంచి విదేశీ సేనలను వెనక్కు పంపినా తాలిబన్లు మాత్రం దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆఫ్ఘన్ సైనికులతోపాటు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు.