న్యూ తైపీ సిటీ: జూడో నేర్చుకుంటున్న ఏడేండ్ల బాలుడు తీవ్ర తల నొప్పిగా ఉన్నట్లు చెప్పాడు. అయినప్పటికీ గురువు, తోటి శిక్షకులు అతడ్ని 27 సార్లు విసిరేశారు. దీంతో అచేతనంగా పడి రెండు నెలలకుపైగా కోమాలో ఉన్న ఆ బాలుడు మంగళవారం మరణించాడు. తైవాన్లో ఈ ఘటన జరిగింది. హువాంగ్ అనే ఇంటి పేరున్న ఏడు ఏండ్ల బాలుడు జూడో నేర్చుకుంటున్నాడు. ఏప్రిల్ 21న క్లాస్కు వచ్చిన అతడు తీవ్ర తలనొప్పిగా ఉన్నదని చెప్పాడు. అయినప్పటికీ హో ఇంటి పేరు కలిగిన శిక్షకుడు పలుమార్లు ఆ బాలుడ్ని విసరడంతో నేలపై పడ్డాడు. తోటి పిల్లలను కూడా అతడితో ప్రాక్టీస్ చేయమని చెప్పడంతో వారు కూడా అతడ్ని కింద పడేశారు. పలుమార్లు తల నేలకు తగిలి అచేతనంగా పడి ఉన్న హువాంగ్ను తైచుంగ్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు.
తలలో తీవ్ర రక్తస్రావం కావడంతో శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు అతడు బ్రైన్ డెడ్ పరిస్థితిలో ఉన్నట్లు బాలుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. బాలుడి తల గాయాలు కారు ప్రమాదాన్ని తలపిస్తున్నాయని చెప్పారు. సుమారు 70 రోజులు కోమాలో ఉన్న బాలుడి అవయవాల వైఫల్యంతోపాటు తీవ్ర శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రాణాధార వ్యవస్థను తీసివేయాలని హువాంగ్ పేరెంట్స్ నిర్ణయించడంతో ఈ నెల 29న ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు శిక్షకుడు హోపై పలు సెక్షన కింద కేసు నమోదు చేసి కోర్టులో విచారణ జరుపుతున్నారు. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఆసుపత్రిని సందర్శించిన ఆ నగర మేయర్ తెలిపారు.