న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ల ప్రయాణాల విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాయి ఏడు యురోపియన్ యూనియన్ దేశాలు. ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్, ఐస్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్ దేశాలు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి. అటు స్విట్జర్లాండ్ కూడా కొవిషీల్డ్ వేసుకున్న ప్రయాణికులను అనుమతించాలని నిర్ణయించింది. యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇప్పటి వరకూ ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్స్జెర్వ్రియా, జాన్సన్ అండ్ జాన్సన్కు చెందిన జాన్సెన్ వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అంటే ఈ నాలుగు రకాల వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్లకు మాత్రమే ఈయూలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ లిస్ట్లో కొవిషీల్డ్ లేకపోవడంతో చాలా మంది ప్రయాణికులను ఈయూ దేశాలు అనుమతించలేదు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వేసుకున్న వాళ్లు ఈ దేశాలకు వస్తే క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కౌంటర్గా బుధవారం భారత విదేశాంగ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఈయూ దేశాలు తమ వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్లను అనుమతించే వరకూ అక్కడి నుంచి ఇండియా వచ్చిన వాళ్లూ క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో యురోపియన్ యూనియన్లో ప్రస్తుతానికి ఈ ఏడు దేశాలు దిగి వచ్చాయి. మిగతా దేశాల విషయంలో ఇంకా స్పష్టత లేదు.