కాబూల్, సెప్టెంబర్ 5: తాలిబన్లు, పంజ్షీర్ బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతున్నది. జాతీయ ప్రతిఘటన దళం(ఎన్ఆర్ఎఫ్ఏ) చేతిలో ఒక్క శనివారమే 600 మందికిపైగా తాలిబన్లు హతమయ్యారు. దాదాపు వెయ్యి మంది తమంతట తామే పంజ్షీర్ బలగాలకు లొంగిపోయారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎన్ఆర్ఎఫ్ఏ అధికార ప్రతినిధి ఫాహీమ్ దశ్తీ ట్వీట్ను ఈ సందర్భంగా ఉటంకించింది. తాలిబన్లు పంజ్షీర్ను ఆక్రమించుకోవడానికి వారం రోజుల క్రితం దాడులు ప్రారంభించారు. వీరిని ఎన్ఆర్ఎఫ్ఏ సమర్థంగా అడ్డుకొంటున్నది.
పూర్తి విరుద్ధంగా తాలిబన్ల ప్రకటన
తాలిబన్లు తమ దాడులకు భయపడి వెనక్కు వెళ్లిపోతున్నారని ఎన్ఆర్ఎఫ్ఏ చెప్తుండగా తాలిబన్ల ప్రకటన మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నది. పంజ్షీర్ ప్రావిన్స్లోని ఎనిమిది జిల్లాలను చేజిక్కించుకొన్నామని, రాజధాని బజారక్ స్వాధీనం ఒక్కటే మిగిలిందని తాలిబన్ ప్రతినిధి బిలాల్ కరీమ్ చెప్పుకొచ్చాడు. బజారక్ వెళ్లే దారుల్లో తాలిబన్ వ్యతిరేక దళాలు ల్యాండ్మైన్లు అమర్చాయి. అందువల్లే బజారక్పై నియంత్రణ ఆలస్యం అవుతున్నది. ఈ విషయాన్ని కరీమ్ కూడా ఒప్పుకొన్నాడు. ఒక్క బజారక్లోనే యుద్ధం సాగుతున్నదని ఆదివారం ట్వీట్ చేశాడు.
అంతర్యుద్ధం తలెత్తొచ్చు..
అఫ్గానిస్థాన్లో అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లే అన్నారు. ఫలితంగా అక్కడ అల్ ఖైదా, ఐసిస్ లాంటి ఉగ్రవాద మూకలు మళ్లీ చెలరేగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా.. సమర్థమంతమైన పాలన అందించగలరా.. అని అనుమానం వ్యక్తం చేశారు.
తాలిబన్లకు బందీగా చిక్కితే నన్ను కాల్చి చంపేయండి: అమ్రుల్లా
‘నేను తాలిబన్లకు బందీగా చిక్కితే వెంటనే నా తలలో తుపాకీతో కాల్చి చంపేయండి. తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదు’ అని అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా తన బాడీగార్డులను ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకొన్న రోజు ఏం జరిగిందనే విషయాలను డెయిలీ మెయిల్కు వివరిస్తూ ఈ విషయం తెలిపారు. రాజకీయ నాయకులు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అమ్రుల్లా అన్నారు. హోటళ్లు, విల్లాలో ఉండి ప్రజలకు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారని, నాయకత్వం వహించలేదని ఆరోపించారు. తాను కాబూల్ నుంచి పంజ్షీర్ వెళ్తుండగా కాన్వాయ్పై రెండు సార్లు దాడి జరిగిందని అమ్రుల్లా తెలిపారు.
చర్చలకు సిద్ధం: మసూద్
పంజ్షీర్, అందారబ్ ప్రావిన్స్ల నుంచి తాలిబన్లు తమ బలగాలను ఉపసంహరించుకొంటే శాంతి చర్చలకు సిద్ధం అని ఎన్ఆర్ఎఫ్ఏకు నేతృత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ ప్రకటించారు. ‘తాలిబన్లతో ఉన్న విభేదాలను నైతిక విలువలు, మత సంప్రదాయాలకు అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఎన్ఆర్ఎఫ్ఏ సిద్ధంగా ఉంది. ప్రభుత్వంలో తాలిబన్లతో పాటు దేశంలోని అన్ని తెగల ప్రజలకు ప్రాతినిధ్యం ఉంటుందన్న విశ్వాసం ఉంది’ వ్యాఖ్యానించారు.