రాంచి: జార్ఖండ్లో 37.3 శాతం మేర వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయన్న కేంద్రం ఆరోపణలపై జార్ఖండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొవిన్ పోర్టల్లో వ్యాక్సిన్ వృథా గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయని, ముందు వాటిని సరిచేయాలని స్పష్టంచేసింది. తాము పంపిన డాటా ఆధారంగా గణాంకాలు సరిచేస్తే, రాష్ట్రంలో టీకాల వృథా 4.63 శాతం కంటే తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇది జాతీయ సగటు (6.3 %) కంటే తక్కువేనని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ల వృథాపై బీజేపీ ఆరోపణలు అవాస్తవం: గెహ్లాట్
రాజస్థాన్లో 11.5 లక్షల డోసులు వృథా అయ్యాయని బీజేపీ చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కొట్టివేశారు. బీజేపీ అసత్య ప్రచారాలతో రాజకీయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ నెల 26 వరకు 1.63 కోట్ల మందికి టీకాలు అందించామని, 3.38 లక్షల డోసులు వృథా అయ్యాయన్నారు.
ఆ కంపెనీలకు లబ్ధి కోసమే టీకాల కృత్రిమ కొరత
న్యూఢిల్లీ: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృత్రిమంగా వ్యాక్సిన్ల కొరత సృష్టిస్తున్నదని ఆమ్ఆద్మీపార్టీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆతిషి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇదో పెద్ద రాకెట్. యువతకు ఉచితంగా టీకా అందించే ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్లకు కొరత ఉన్నది. కానీ ప్రైవేట్ దవాఖానల్లో మాత్రం అధిక ధరలకు వ్యాక్సిన్లు దొరుకుతున్నాయి. మరిన్ని కంపెనీల వ్యాక్సిన్లకు కేంద్రం ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు. ఫైజర్కు 85 దేశాలు, మోడెర్నా టీకాకు 46 దేశాలు, జే అండ్ జే వ్యాక్సిన్కు 41 దేశాలు అనుమతులు ఇచ్చాయి. వాటికి మన దేశంలో ఎందుకు అనుమతులు ఇవ్వలేదు. సీరం, భారత్ బయోటెక్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం వ్యాక్సిన్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నదని’ ఆమె ఆరోపించారు.