జకార్తా : ఇండోనేషియాలోని జావా ద్వీపం తీరంలో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే సునామీ హెచ్చరిక జారీ కాలేదు. తూర్పు జావాలోని మలంగ్ నగరానికి నైరుతి దిశలో 45 కిలోమీటర్ల దూరంలో 82 కిలోమీటర్ల (50 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించింది. అయితే భూకంప ప్రమాదానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప ధాటికి మలంగ్ నగరం షాక్కు గురైంది. మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సులవేసి ద్వీపంలోని పలులో 2018లో సంభవించిన భూకంప ధాటికి, ఆ తర్వాత వచ్చిన సునామీ కారణంగా 4,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొందరు గల్లంతు అయ్యారు. నాడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. 2004, డిసెంబర్ 26న సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సునామీ రావడంతో 2,20,000 మంది చనిపోయారు. ఇందులో ఇండోనేషియా ప్రజలు 1,70,000 ఉన్నారు.