ఇస్లామాబాద్: తమ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంపై పాకిస్థానీలు తెగ ఖుషీ అయిపోతున్నారు. గాలప్ పాకిస్థాన్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు జియో న్యూస్ వెల్లడించింది. పాకిస్థాన్లోని మొత్తం నాలుగు ప్రావిన్స్లలో ఆగస్ట్ 13 నుంచి సెప్టెంబర్ 5 మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 2400 మందిని ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వం రావడం మీకు సంతోషంగా ఉందా అని ప్రశ్నించగా.. 55 శాతం మంది తాము సంతోషంగా ఉన్నట్లు చెప్పడం గమనార్హం.
25 శాతం మంది తాము సంతోషంగా లేమని చెప్పగా.. మరో 20 శాతం మంది ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ ప్రావిన్స్లలోనూ ఖైబర్ పఖ్తూంఖ్వాలో అత్యధికంగా 65 శాతం మంది తాలిబన్ల ప్రభుత్వం రావడం తమకు చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పడం గమనార్హం. ఇక బలోచిస్థాన్లో 55 శాతం మంది, పంజాబ్, సింధ్ ప్రావిన్స్లలో 54 శాతం మంది సంతోషం వ్యక్తం చేశారు. గత నెల 15న ఆఫ్ఘనిస్థాన్లో మళ్లీ తాలిబన్లు అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే అంతకు రెండు రోజుల ముందు నుంచే ఈ సర్వే ప్రారంభించారు. ఇక తాలిబన్ల ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్న వాళ్లలో 68 శాతం మంది 50 ఏళ్లు పైబడిన వాళ్లు కావడం గమనార్హం. ఇక వీళ్లలో 58 శాతం మంది పురుషులు కాగా.. 36 శాతం మంది మహిళలు ఉన్నారు.