వర్సావ్: టోక్యో ఒలింపిక్స్కు ముందు ఆఖరి ర్యాంకింగ్ సిరీస్ అయిన పోలండ్ టోర్నీలో భారత యువ రెజ్లర్ రవి దహియా రజత పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 61కిలోల బౌట్లో రవి 3-5 తేడాతో గులోమ్జన్ అబ్దుల్లెవ్(ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు రవి ప్రయత్నించాడు. డబుల్ లెగ్, రైట్ లెగ్ దాడులతో అబ్దుల్లెవ్ను కట్టడి చేసినా లాభం లేకపోయింది. ఉజ్బెకిస్థాన్ రెజ్లర్ పటిష్ఠ డిఫెన్స్తో రవిని నిలువరించి కీలక పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి తోడు ప్రతి దాడులకు పూనుకోవడంలో రవి విఫలం కావడంతో పసిడి పతకాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన తొలి బౌట్లో అబ్దుల్లెవ్ను నిలువరించిన దహియా ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు. ఫైనల్కు ముందు అద్లాన్ అస్కరోవ్(కజకిస్థాన్), నాథన్ ఖలీద్(అమెరికా), రెజా అహ్మద్అలీపై రవి వరుస విజయాలు సాధించాడు.