ఆత్మీయుల యాదిలో స్మృతి నిలయాలు
సమాధుల వద్ద విగ్రహాలతో ఆకర్షణీయంగా కోవెలలు
ఇంటిల్లిపాది వారం వారం పూజాది కార్యక్రమాలు
ఓదెల మండలంలో పలువురి ప్రత్యేకత
ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న కుటుంబాలు
ఓదెల, ఏప్రిల్ 3: గ్రామీణ జీవన విధానంలో మనుషుల మధ్య విడదీయరాని సంబంధం ఉండేది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు కనిపించేవి. ఊళ్లోని ప్రజలతో ఎంతో అనుబంధం ఉండేది. అక్క, బావ, తమ్ముడు ఇలా వరుసలతో పిలుచుకునే సంస్కృతి కనిపించేది. గతంలో క్షేమ సమాచారానికి ఉత్తరాలు రాసేవారు. లేదా పెండ్లిళ్లో, పండుగలకో కలుసుకొని రోజంతా సంతోషంగా గడిపేవారు. ఇంటికి చుట్టాలు వచ్చి తిరిగి వెళ్తుంటే మళ్లీ ఎప్పుడు కలుస్తామోనని ఏడ్చుకుంటూ పోయే రోజులు ఉండేవి. తల్లిదండ్రులు, కొడుకుల మధ్య విడదీయరాని అనుబంధం ఉండేది. అలాంటివి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్లు, సెల్ఫోన్ల రాకతో అవన్నీ కనుమరుగైపోతున్నాయి. మనకు కావాల్సిన వ్యక్తి ప్రపంచంలో ఏ మూలన ఉన్నా క్షణాల్లో మాట్లాడగలుతున్నాం. స్కైప్, వీడియో కాల్స్ ద్వారా చూస్తున్నాం. ఇవన్నీ ఒకరకంగా మేలు చేసేవే అయినప్పటికీ సంబంధ బాంధవ్యాలకు గొడ్డలిపెట్టులా మారాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. కనీపెంచిన తల్లిదండ్రులనే వృద్ధాశ్రమాల్లోకి నెట్టేస్తున్నారు. కొడుకులు అన్నం పెట్టడం లేదని ఠాణా మెట్లు ఎక్కుతున్న తల్లిదండ్రుల గురించి వింటున్నాం. అమ్మానాన్నలను వంతులవారీగా సాకలేక రోడ్లపై వదిలిపెట్టి వెళ్తున్న కొడుకుల గురించి రోజుకో కథనం చదువుతున్న ఈ రోజుల్లో పలువురు వ్యక్తులు ఆత్మీయులకు గుడి కట్టి పూజిస్తున్నారు.
అనుబంధానికో గుడి..
ఓదెల మండలంలోని పలువురు తమ కుటుంబసభ్యులు చనిపోతే గుండెల్లో గుడికట్టుకుంటున్నారు. వారి సమాధుల వద్ద లక్షలరూపాయలతో ఆకర్షణీయంగా స్మృతి నిలయాలు నిర్మిస్తున్నారు. మృతుల ప్రతిమలు ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఇది ఓదెల మండలం లంబాడితండాలోని ఓ స్మృతి నిలయం. గ్రామానికి చెందిన లక్ష్మణ్-పరంగి దంపతులకు కొడుకు రాజూనాయక్తోపాటు ముగ్గురు కూతుళ్లు. లక్ష్మణ్ సింగరేణి ఉద్యోగి. పిల్లలు అంటే చాలా ఇష్టం. అల్లారుముద్దుగా చూసుకునేవాడు. డ్యూటీ పోను మిగతా సమయం అంతా వారితోనే గడిపేవాడు. అయితే విధి వక్రీకరించింది. 2011లో అకస్మాత్తుగా రాజునాయక్ గుండెపోటుతో మృతిచెందగా, తల్లిదండ్రులు కుంగిపోయారు. కొడుకు లేడనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. రోజూ అతని జ్ఞాపకాలతో గడిపేవారు. గ్రామ శివారులోని తమ స్థలంలో కొడుకు ప్రతిమతో ఆకర్షణీయంగా స్మృతి నిలయం నిర్మించారు. గుడిలో దేవుడిని పూజించినట్లే ఇంటిల్లిపాది వారం, వారం సమాధి వద్దకు వెళ్లి కొడుకు జ్ఞాపకాలను స్మరించుకుంటూ మొక్కుతున్నారు. ఇలా లక్ష్మణ్ కుటుంబమేకాదు మండలంలోని కొలనూర్, ఓదెల, కనగర్తి, శానగొండ, నాంసానిపల్లి, పొత్కపల్లి, గుంపుల, గుండ్లపల్లి, ఉప్పరపల్లి దాదాపు 20 మంది దాకా ఇలా ఆత్మీయుల యాదిలో జీవిస్తున్నారు.
ఇవి కూడా చూడండి..
హాస్పిటల్లో చేరిన ఫారూక్ అబ్దుల్లా..
నటి కుష్బూ తరఫున అమిత్ షా ప్రచారం