న్యూఢిల్లీ: పంచ సూత్రాల అమలు వ్యూహంతోనే కరోనా మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు 10 రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతమవుతోన్న వేళ ఆయన ఆదివారం ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా నిబంధనలను ప్రజలు వందశాతం పాటించే విధంగా విస్తృత అవగాహన చేపట్టడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు ప్రధాని మోదీ సూచించారు. ఈ సమావేశంలో కేబినెట్ సెక్రటరీ, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ‘టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, కొవిడ్ నిబంధనలు పాటించడంతోపాటు వ్యాక్సినేషన్ వేగం పెంచడం’ వంటి పంచ సూత్రాల వ్యూహాన్ని అమలు పరచాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో దేశీయ అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని భారీగా పెంచడంతోపాటు పంపిణీని వేగవంతం చేయాలని ప్రధానమంత్రి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటైజ్ నిబంధనలను కచ్చితంగా, నిబద్ధతతో పాటించడం వల్ల కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. వీటి ప్రాధాన్యతను వివరిస్తూ ఈ నెల ఆరో తేదీ నుంచి 14 తేదీ వరకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు.
కరోనా పాజిటివ్ కేసుల్లో 57శాతం, మరణాల్లో 47శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలల్లో కేంద్ర వైద్య నిపుణుల బృందాలు పర్యటించాలని అధికారులకు ప్రధానమంత్రి మోదీ సూచించారు.
కరోనా తీవ్రత పెరగడానికి మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించకపోవడమే కారణమని నిపుణుల నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. గత 14రోజులుగా దేశంలో నమోదవుతోన్న కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే అధికంగా ఉండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా ఆంక్షలు విధించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కాస్త అడ్డుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. కరోనా కేసులు, మరణాల్లో 91శాతం కేవలం పది రాష్ట్రాల నుంచే నమోదవుతుండడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కరోనా ఎఫెక్ట్ : బీహార్లో వారంపాటు విద్యాసంస్థల మూసివేత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
విద్యా రుణాలకు ఈ బ్యాంకులు బెస్ట్!
రిలయన్స్-ఫ్యూచర్ డీల్కు 6 నెలల గడువు
వేదాంత కెయిర్న్తో జగడం.. లాభాల రికవరీకి కేంద్రం నోటీసు