మల్కాజిగిరి, మే 25: 72 ఏండ్ల ఓ వృద్ధురాలు కరోనాను జయించింది. పాజిటివ్ వచ్చిన వారం రోజుల్లోనే కోలుకొని సంతోషంగా ఇంటికి వెళ్లింది. వివరాల్లోకి వెళ్లితే, పీవీఎన్ కాలనీకి చెందిన 72 సంవత్సరాల వృద్ధురాలికి వారం రోజుల కిందట కరోనా రాగా, కుటుంబ సభ్యులు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి గాంధీ దవాఖానాకు తీసుకెళ్లాలని సూచించారు. గాంధీకి తీసుకెళ్లగా, ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందించారు. వారం రోజుల్లో కోలుకొని మంగళవారం వృద్ధురాలు డిశ్చార్జి అయింది. ఈ సందర్భంగా ఆ వృద్ధురాలు మాట్లాడుతూ, సర్కారు దవాఖానలో వైద్యులు తనకు ప్రాణం పోశారని, ఈ వయస్సులో తన పట్ల ఎంతో శ్రద్ధ చూపారని, వారి దయ వల్లనే త్వరగా కోలుకొని ఇంటికి వెళ్తున్నానని సంతోషం వ్యక్తం చేసింది. కరోనా నుంచి ఇంత త్వరగా కోలుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. మంగళవారం జిల్లా ఆస్పత్రి నుంచి కరోనాతో కోలుకుని 8 మంది డిశ్చార్జి అయ్యారని సూపరింటెండెంట్ డాక్టర్ రాజు తెలిపారు.