నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం
అమ్మ.. ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో.. ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జనమ్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో బిడ్డను చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఇంట్లో పిల్లల బాగోగులు చూస్తూ.. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న మహిళామణుల గురించి ప్రత్యేక కథనం …
పండిత్ వినితా పవన్
మున్సిపల్ చైర్పర్సన్, ఆర్మూర్
విద్యాభ్యాసం : ఎంటెక్, విజ్ఞాన్ యూనివర్సిటీ (వడ్లమూడి)లో సెన్సార్ వైర్లెస్ కమ్యూనికేషన్లో పీహెచ్డీ పూర్తి
భర్త : పండిత్ పవన్
పిల్లలు : ప్రద్యుమ్న్ (8వ తరగతి), ప్రజ్ఞాన్ (6వ తరగతి)
తల్లిదండ్రులు : అల్జాపూర్ లక్ష్మీనారాయణ – అల్జాపూర్ రాజసులోచన
ఆర్మూర్, మే 8 :
ఉన్నత విద్యావంతురాలైన పండిత్ వినితాపవన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. బల్దియా పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో వినిత చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. వినిత పవన్ రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టి పెరిగారు. తల్లిదండ్రులైన అల్జాపూర్ లక్ష్మీనారాయణ – అల్జాపూర్ రాజసులోచనలు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో ఉన్నత చదువులను చదివిస్తూ విలువలతో కూడిన సంస్కారాన్ని నేర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్గా రెండేళ్లుగా కొనసాగుతూ కరోనా సమయంలో సైతం ఆర్మూర్ పట్టణ ప్రజలకు మెరుగైన పాలనను అందిస్తూ మన్ననలను పొందుతూ ఔరా అనిపించుకుంటున్నారు. ఇటీవల కరోనా నేపథ్యంలో వీధివ్యాపారులకు అందించిన రుణాల్లో సైతం ఆర్మూర్ మున్సిపల్ను దేశంలోని మొదటి పది మున్సిపాలిటీల్లో నిలబెట్టారు.
ఉన్నత సంస్కారాలతో పెంచింది..
మా అమ్మ అల్జాపూర్ రాజసులోచన చిన్ననాటి నుంచే విలువలతో కూడిన సంస్కారంతో పెంచింది. చదువు ఉంటేనే ఏదైనా సాధించగలం. డబ్బు శాశ్వతం కాదు, చదువుకోవడమే ముఖ్యమని నేర్పింది. అమ్మ చెప్పిన మాటల వల్లే పీహెచ్డీ పూర్తి చేశా. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డిల ప్రోత్సాహంతో చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నా. మా అన్నయ్యను, నలుగురు అక్కాచెల్లెళ్లను చిన్నతనం నుంచే ఆప్యాయతతో పెంచి ఉన్నత విద్యాబుద్ధులు నేర్పింది మా అమ్మ. ప్రతి మహిళా ధైర్యంగా ముందుకు సాగాలి.
దండు నీతూ కిరణ్
నగర మేయర్, నిజామాబాద్
విద్యాభ్యాసం : బీఎస్సీ బీజెడ్సీ
భర్త : దండు చంద్రశేఖర్
తల్లిదండ్రులు : హరిదాస్ అనసూయ, పెంటయ్య
పిల్లలు : కృష్ణచైతన్య, రఘువంశీ, రిషిత
ఖలీల్వాడి, మే 8 :
అత్తింటి రాజకీయ అనుభవం.. పుట్టింటి విద్యాభ్యాసం.. ఈ రెండు కలిసి నిజామాబాద్ నగర మేయర్ పీఠాన్ని దండు నీతూ కిరణ్ను అధిరోహించేలా చేశాయి. అత్త అనసూయ రెండుసార్లు కౌన్సిలర్గా పని చేశారు. భర్త చంద్రశేఖర్ 20ఏండ్లుగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. వీరిద్దరి ప్రోత్సాహంతో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నీతూ కిరణ్ తొలి ప్రయత్నంలోనే కార్పొరేటర్గా గెలిచి మేయర్ అయ్యారు. పట్టభద్రురాలైన ఈమె సంతోషకరమైన పాలన అందిస్తూ నగర ప్రజల మనస్సు గెలుచుకుంటున్నారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ స్ఫూర్తిగా నిలిచారు.
పట్టుబట్టి డిగ్రీ చదివించింది..
మా అమ్మ అనసూయ చదువుకోలేదు. నన్ను చదువుకోవాలని పట్టుబట్టి డిగ్రీ వరకు చదివించింది. నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఇబ్బందులు ఎన్ని ఉన్నా చదువుకు ఆటంకం లేకుండా చూసింది. ఆ చదువు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. నేను మేయర్ అయ్యాను కానీ ప్రస్తుతం తల్లిదండ్రులు లేకపోవడం నా దురదృష్టంగా భావిస్తున్నా. వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. అమ్మ దగ్గర చాలా నేర్చుకున్నా.
అమ్మ కావడంతో పరిపూర్ణత్వం..
తల్లి కావడం ఏ మహిళకైనా గొప్ప అదృష్టం. అమ్మ కావడమే మహిళకు పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. నాకు ముగ్గురు పిల్లలు. వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నా. రాజకీయం ఒకవైపు, నా పిల్లలు ఒక వైపు. వారితో స్నేహితురాలిగా ఉంటాను. చదువులోనూ సహకరిస్తాను. మంచి చెడులు బోధిస్తూ వారు సరైన మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తున్నా.
మహిళలు అధైర్యపడొద్దు..
అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారు. అందుకు నిదర్శనమే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా మహిళలను ఎన్నుకోవడం. మహిళలు ముందుకు వస్తేనే దేశం బాగుపడుతుంది. మహిళలు అధైర్యపడకుండా అన్నింటినీ ఎదుర్కొన్నప్పుడే ఏదైనా సాధించగలం.
తూము పద్మాశరత్రెడ్డి
మున్సిపల్ చైర్పర్సన్, బోధన్
విద్యాభ్యాసం: బీఎస్సీ కంప్యూటర్
భర్త : తూము శరత్రెడ్డి
సంతానం: మనస్వి (10వ తరగతి), పూర్వీ (8వ తరగతి)
రాజకీయ నేపథ్యం: గత మున్సిపల్ ఎన్నికల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. మామ పెద్దారెడ్డి, భర్త శరత్రెడ్డిలు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు.
బోధన్, మే 8 : బోధన్ పురపాలక సంఘం చైర్పర్సన్గా ఎన్నికైన తూము పద్మాశరత్రెడ్డి మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం. బోధన్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టడంలోనూ, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నవతరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె బీఎస్సీ కంప్యూటర్స్ చదివారు. బోధన్కు చెందిన తూము శరత్రెడ్డిని 2005లో వివాహమాడారు. మున్సిపల్ ఎన్నికల కంటే ముందు పద్మాశరత్రెడ్డి గృహిణిగా ఉండేవారు. అయినప్పటికీ, సామాజిక, రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహనను అలవర్చుకునేవారు.
నాయకత్వ లక్షణాలకు అమ్మే కారణం..
నాపై తల్లి ఆదిలక్ష్మి ప్రభావం ఎం తో ఉంది. విద్యావంతురాలిగా చూడాలన్న తపనతో ఎప్పుడూ ప్రోత్సహించేది. నాలో నాయకత్వ లక్షణాలు పెం పొందడం వెనుక అమ్మ పాత్ర ఎంతో ఉంది. ‘అందరి ఆడపిల్లల్లా మా అమ్మ నాపై ఆంక్షలు పెట్టేది కాదు.. క్రమశిక్షణతో ఉండాలని చెప్పేది. నన్ను చదువుకోమని ఎంతగానో ప్రోత్సహించేది. మా అమ్మతో అనుబంధం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంటుంది.
పిల్లలకు మంచి తల్లిగా ఉండాలని..
మాకు ఇద్దరు ఆడ పిల్లలు.. పెద్దమ్మాయి మనస్వి, చిన్నమ్మాయి పూర్వీ. వారిద్దరినీ బాగా చదివించాలన్నదే నా తపన. నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచీ పిల్లల ఆలనాపాలన, వారి చదువు విషయం నేనే స్వ యంగా చూసేదాన్ని. ఇప్పడు మున్సిపల్ చైర్పర్సన్గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, పిల్లలకు సబ్జెక్టుల్లో వచ్చే సందేహాలను ఆన్లైన్లో తీరుస్తూ ఉంటాను. మంచి తల్లిగా వారి ఉన్నతికి కృషిచేస్తున్నాను.