బెంగళూర్ : మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి భార్య నిలదీయడంతో హోటల్ యజమాని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బసవేశ్వర్నగర్ ప్రాంతంలోని కమలానగర్లో నాగరాజు హోటల్ నిర్వహిస్తున్నాడు. తమ హోటల్లో పనిచేసే కుక్ కుమార్తె గౌరమ్మకు నాగరాజు దగ్గరయ్యాడు. వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ వ్యవహారం కాస్తా నాగరాజు భార్యకు తెలియడంతో ఆయనను నిలదీసింది. దీంతో మనస్ధాపానికి లోనైన నాగరాజు సీలింగ్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి ముందు గౌరమ్మకు నాగరాజు వాయిస్ మెసేజ్లు పంపాడు. మనశ్శాంతి కరువై జీవితం పట్ల విసుగెత్తి తనువు చాలిస్తున్నానని ఈ మెసేజ్ల్లో పేర్కొన్నాడు. నాగరాజు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని బెంగళూర్ పోలీసులు తెలిపారు.