నల్లగొండ సిటీ, మే 4 : కన్న బిడ్డను కిరాతకంగా చంపిన వ్యక్తికి జీవిత ఖైదుతోపాటు 6 నెలల కఠిన కారాగార శిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేశ్బాబు మంగళవారం తీర్పునిచ్చారు. పట్టణంలోని బోయవాడలో నివాసముంటున్న అంబూరి వెంకటేశ్ 2012లో కూతురు శివాని(13)ని టవల్తో గొంతు నులిమి హత్యచేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అప్పటి సీఐ మనోహర్రెడ్డి విచారణ చేసి కోర్టుకు ఆధారాలు సమర్పించారు. నిందితుడి భార్య ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ మృతిచెందడంతో తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇందుకు కూతురు అడ్డుగా ఉన్నదని, ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించి హత్యకు పాల్పడ్డాడు. సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు నిందితుడు ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్టు ధ్రువీకరించి జీవిత ఖైదు విధించింది.