హాజీపూర్, మార్చి 30 : జిల్లాలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్ను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్లో పురోగతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నర్సరీల్లో మొక్కల పెంపు, ధరణి, కొవిడ్-19, పట్టణాల్లో సమీకృత కూరగాయలు, వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నందునా, రైతులకు ఇబ్బంది కలుగకుండా గత సంవత్సరంలాగానే జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే జిల్లాలో మిగిలి ఉన్న పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీల్లో మొక్కలను పెంచాలన్నారు. ప్రతి ఒక్కరికీ కనీసం 100 రోజుల ఉపాధి హామీ పని కల్పించాలన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలని సూచించారు. కొవిడ్ టీకాలను అందరూ వేసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి వారం మండల ప్రత్యేక అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యేలా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండాచూస్తామని, అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని, కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, మధుసూదన్ నాయక్, ఆర్డీవో శ్యామలాదేవి, డీఆర్డీఏ శేషాద్రి, డీసీఎస్వో ప్రేమ్కుమార్, సివిల్ సప్లయ్ డీఎం గోపాల్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.