గాజా: ఇజ్రాయెల్ మిలిటరీ, పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. వీరి మధ్య గత సోమవారం మొదలైన ఘర్షణ.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీసింది. తాజాగా ఇజ్రాయెల్ సైనిక బలగాలు పాలస్తీనాలోని గాజా నగరంపై వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఆదివారం జరిగిన ఈ దాడుల్లో గాజాలోని మూడు భవనాలు కుప్పకూలాయి. 26 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన 26 మంది మృతుల్లో 10 మంది మహిళలు, ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 50 మందికిపైగా గాయపడినట్లు తెలిపింది. కాగా, గాజాలో హమాస్ మిలిటెంట్ నాయకులు తలదాచుకున్న భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
గత వారం రోజులుగా ఇజ్రాయెల్ సేనలు-హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న పోరువల్ల భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. గాజాలో మొత్తం 181 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 31 మంది మహిళలు, 52 మంది పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్ వైపున కూడా ఓ ఐదేండ్ల బాలుడు, ఒక సైనికుడితోపాటు మొత్తం ఎనిమిది మంది మృతిచెందారు.