సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 5 : విజ్ఞానమనేది తరగనిది, వయసుతో సంబంధం లేకుండా జ్ఞానాన్ని సంపాదించడమనేది నిరంతర ప్రక్రియ అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో ఎస్డీఎఫ్, గ్రంథాలయ సంస్థ నిధులు రూ.3.30 కోట్లతో నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ భవనాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రజలు, పాఠకుల సౌకర్యార్థం అన్ని వసతులు, ఆధునిక హంగులతో జిల్లా గ్రంథాలయ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. పాఠకుల అభిరుచికి అనుగుణంగా 9 ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ దినపత్రికలు కేంద్ర గ్రంథాలయంలో పాఠకుల సౌకర్యార్థం అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధ్దమయ్యే జిల్లా ఉద్యోగార్థుల కోసం 40 మంది సామర్థ్యం గల రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేశామని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో దినపత్రికలు, జర్నల్స్, మ్యాగజైన్స్ చదివేందుకు వీలుగా వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశామని తెలిపారు. దీనిని నేషనల్ డిజిటల్ లైబ్రరీతో అనుసంధానం చేసినట్లు తెలిపారు. విజ్ఞాన సముపార్జనకు నిలయం గ్రంథాలయమన్నారు. నేటి కాలంలో సెల్ఫోన్ ఒక వ్యసనంగా మారిందని, ముఖ్యంగా పిల్లలు డిజిటల్ ఉపకరణాలకు దూరంగా ఉంచేలా తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రానున్న రోజుల్లో పాఠకుల అభిరుచి, ఆలోచనలు, సూచనలు, సలహాలకు అనుగుణంగా మరింత ప్రయోజనకరంగా గ్రంథలయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. కవులు, రచయితలు, మహిళలు జిల్లా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని తమ వృత్తి నైపుణ్యాన్ని, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నూతన జిల్లా గ్రంథాలయం ప్రారంభించుకున్నప్పటికీ, పాత లైబ్రరీని కొనసాగిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు.
త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు లక్షా 34 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలోనే మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెలురించనున్నదని తెలిపారు. జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధ్దమయ్యే అభ్యర్థులకు రాష్ట్రంలోని సబ్జెక్టు నిపుణులచే రెండు నెలల పాటు ప్రత్యేక తరగతులకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఉద్యోగార్థులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
గ్రంథాలయానికి వేముగంటి నర్సింహాచార్యులు పేరు
కవికోకిల, కావ్య కళానిధి, విద్వత్కవి బిరుదాంకితులు, సాహిత్య వికాసానికి కృషి చేసిన సిద్దిపేట వాసి డాక్టర్ వేముగంటి నర్సింహాచార్యులు పేరును జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పెడుతున్నట్లు సభలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రకటించారు. వేముగంటి నర్సింహాచార్యులు తిక్కన, రామదాసు అనే పద్యకావ్యాలను, మంజీర నాదాలు అనే గేయకావ్యాన్ని, వివేక విజయం అనే కావ్యఖండికతో పాటు 40 పుస్తకాలు రచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు.
విజ్ఞాన సముపార్జనకు వేదికలు
విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు చక్కటి వేదికలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. మహిళలకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినందుకు మంత్రి హరీశ్రావుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు తీరిక సమయంలో సీరియల్లు చూడకుండా గ్రంథాలయానికి వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవాలని తెలిపారు.
ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. మంత్రి హరీశ్రావు నిరంతరం శ్రమించే వ్యక్తి అని అన్నారు. సిద్దిపేట ఉన్నన్ని రోజులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు పేర్లు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.
మంత్రి హరీశ్రావు కృషితోనే ఇంత మంచి గ్రంథాలయం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మించుకున్నామని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. ప్రభుత్వాల ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారికి అన్ని రకాల సబ్జెక్టుల విషయ పరిజ్ఞానం కలిగేలా ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. దేశంలోని అన్ని వెబ్సైట్లను అనుసంధానం చేసే ఇక్కడ డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉందన్నారు. గత ప్రభుత్వాలు గ్రంథాలయాలను పట్టించుకోలేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. మంత్రి హరీశ్రావు సహకారంతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నామని, ఇంత మంచి గ్రంథాలయం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక కృషి చేసిన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ కూడా చదవండి…