మాంసం, అన్నం ముట్టకుండా బిస్కెట్లతోనే..
భక్తులను ఆశ్చర్య పరుస్తున్న కుక్క
ఉట్నూర్, ఏప్రిల్ 3: సాధారణంగా మనుషులకు దైవభక్తి ఎక్కువ.. కానీ ఓ శునకం ఆరేండ్లుగా అంజన్న సేవలో తరలిస్తున్నది. సామాన్యంగా కుక్కలు మాంసాహారాన్ని చాలా ఇష్టపడి తింటాయి.. కానీ ఈ శునకం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. మండలంలోని లక్కారం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ఓ కుక్క తన చిన్నతనం నుంచి ఆలయంలోనే ఉంటూ మాంసం, అన్నం తదితరవి తినకుండా అంజన్న సేవ చేస్తున్నది.
ఆరేండ్ల క్రితం మురుగు కాలువలో దర్శనం..
ఆలయ పూజారులు రమాకాంత్, జ్ఞానేశ్వర్కు ఆరేండ్ల క్రితం గుడి ఎదుట మురుగు కాలువలో ఓ చిన్న కుక్కపిల్ల కనిపించింది. దీంతో వారు దానిని చేరదీసి ఆలయ ఆవరణలోనే పెంచారు. మొదట ఆరు నెలల పాటు అన్నం, పాలు అందించారు. అనంతరం ఒక్కసారిగా అన్నం తినడం మానేసింది. ఏం తినడం లేదని ఉదయం, రాత్రి పార్లే-జీ బిస్కెట్ పెడుతూ వచ్చారు. ఆరు సంవత్సరాలు కావస్తున్నా అవే బిస్కెట్లు తింటూ ఉంటున్నది. పైగా ఇటీవల ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. ఆలయ ఆవరణ దాటకుండా అంజన్న పాదాల వద్ద సేదతీరుతూ భక్తులను ఆశ్చర్యపరుస్తున్నది. ఆలయానికి వచ్చే చిన్నపిల్లలు దానిని ఇబ్బంది పెట్టినా, దాని పిల్లలను ముట్టినా ఏమీ అనకుండా ప్రశాంతంగా ఉంటు న్నది. ఈ కుక్కను చూసిన వారు మనుషులకే కాదు.. పశుప క్ష్యాదులకూ దైవభక్తి ఉంటుందని చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చూడండి..
మమతాజీ వారణాసి రండి.. స్వాగతం: మోదీ
5 నుంచి 71 అన్ రిజర్వుడ్ రైలు సర్వీసులు షురూ!