ఐదుగురు ప్రతిపక్ష, ఒక టీఆర్ఎస్ సభ్యుడి హాజరు
22 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరు
కోరంలేక వాయిదా వేసినచైర్పర్సన్ వెంకటరాణీ సిద్ధు
భూపాలపల్లి టౌన్, మార్చి 30: భూపాలపల్లి మున్సిపల్ బడ్జెట్ సమావేశం వాయిదా పడింది. 2020-21 సంవత్సరానికి సవరించిన, 2021-22 సంవత్సరానికి బడ్జెట్ అంచనాల ఆమోదం కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశానికి 22 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్తోపాటు ఐదుగురు ప్రతిపక్ష కౌన్సిలర్లు, ఒక టీఆర్ఎస్ కౌన్సిలర్, నలుగురు కోఆప్షన్ సభ్యులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. దీంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు ప్రకటించారు. భూపాలపల్లి మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని ఏరియాలోని మంజూర్నగర్లో ఉన్న ఇల్లందు అతిథిగృహంలో చైర్పర్సన్ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేశారు.
ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి కమిషనర్, చైర్పర్సన్, వైస్ చైర్మన్ కొత్త హరిబాబుతోపాటు ప్రతిపక్ష సభ్యులు దాట్ల శ్రీనివాస్, కన్నం యుగేందర్, కురిమిళ్ల రజితా శ్రీనివాస్, ఉడుత సరోజన హాజరయ్యారు. టీఆర్ఎస్ సభ్యురాలు పిల్లలమర్రి నారాయణ, కోఆప్షన్ సభ్యులు దొంగల ఐలయ్య, ఇర్ఫాన్, బేతోజు వజ్రమణి, కమల హాజరయ్యారు. మిగిలిన సభ్యుల కోసం మధ్యాహ్నం 12 గంటల వరకు అధికారులు, సభ్యులు ఎదురు చూశారు. అయినా వారు రాకపోవడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. సమావేశ తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్కు చెందిన 22 మంది సభ్యులు సమావేశానికి గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్లో ప్రతీది ఆన్లైన్ ప్రక్రియలో కొనసాగుతోందని, అవినీతి ఆరోపణలకు తావు లేదని అధికారులు చెబుతున్నారు.