నల్లగొండ : ‘నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి ఇక గతం మాత్రమే. ఇన్నాళ్లు దీటైన నాయకుడు లేక గెలుస్తూ వచ్చారు.
ఆయన తన రాజకీయ జీవితంలో నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారు. ప్రజలకు తాగేందుకు గుక్కెడు నీళ్లు సైతం ఇవ్వలేక పోయారు.
ఆయన హయాంలో సాగర్ ఎడమ కాలువ కింద మొట్టమొదటి రాజవరం మేజర్కే సాగునీళ్లు రాలేదు’ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ నామినేషన్కు దాఖలు కార్యక్రమానికి హాజరైన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు.
యువకుడు, విద్యావంతుడు భగత్ను ఆశీర్వదించి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధిలో పరుగులు పెట్టిందని అన్నారు.
జానారెడ్డి సవాలు గమ్మతుగా ఉందని.. నామినేషన్ వేసి ప్రచారం చేయకుండా ఎవరి ఇంట్లో వారే ఉందాం అని అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
‘జానారెడ్డి చేసింది.. చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ప్రచారం వద్దని అంటున్నారు. జానారెడ్డి మాటల్లో ఓటమి భయం కనపిస్తుంది.
ఈ ఎన్నికల్లో 2018 ఎన్నికల ఫలితం పునరావృతం ఖాయం. ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. వ్యవసాయం పండుగలా మారింది’ అని మంతి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.