పాలకుర్తి : అర్హులైన దివ్యాంగులందరికీ లబ్ధి చేకూరేలా అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దివ్యాంగులకి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దవ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలోనూ అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కొనసాగిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు.
కరోనా సమయంలో దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు తదితరులకు ఇచ్చిన పెన్షన్లు వారికి ఎంతో ఊరట ఇచ్చాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 3016/- పెన్షన్స్ అంటే, ప్రతి నెలా రూ.150 కోట్లు, సంవత్సరానికి రూ.1800 కోట్లు ఒక్క ఆసరా పథకం ద్వారా దివ్యాంగులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని కొనియాడారు.