న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నేషనల్ డే, ఆ దేశ తొలి అధ్యక్షుడు షేక్ ముజీబుర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా బంగ్లాదేశ్లో ప్రముఖ పత్రిక అయిన ద డైలీ స్టార్లో ప్రత్యేకంగా ఆర్టికల్ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ. శుక్రవారం బంగ్లా పర్యటనకు మోదీ వెళ్లే ముందు ఆ పత్రిక ఈ ఆర్టికల్ను ప్రచురించింది. బంగ్లాదేశ్ ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి ప్రధాన కారణమైన బంగబంధు రెహమాన్ సేవలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు.
దక్షిణాసియా మరోలా ఉండేది
ఒకవేళ బంగబంధు ఇప్పటికీ జీవించి ఉండి ఉంటే బంగ్లాదేశ్, ఇండియా మధ్య సంబంధాలు, దక్షిణాసియా పరిస్థితులు మరోలా ఉండేవని ఆ ఆర్టికల్లో మోదీ అభిప్రాయపడ్డారు. బంగ్లా జాతిపితగా పేరుగాంచిన ముజీబుర్ రెహమాన్ ఆ దేశ తొలి అధ్యక్షుడిగా, రెండో ప్రధానిగా చేశారు. 1975, ఆగస్ట్ 15న ఆయన హత్యకు గురయ్యారు. బంగబంధు జీవితం కష్టాలమయం. అణచివేతకు గురైనా అన్ని సవాళ్లకు ఎదురొడ్డి నిలిచిన సాహసవంతుడు ఆయన. బంగమాత షేక్ ఫజిలాతున్నెసా ఆయనకు బలంగా నిలిచారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని మోదీ తన ఆర్టికల్లో కొనియాడారు. కొవిడ్-19 మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడిన తర్వాత మోదీ తొలిసారి చేస్తున్న విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.