పొడి చెత్త విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విక్రయం
పంచాయతీకి ఇద్దరి నియామకం
కంపోస్టు షెడ్ల నిర్వహణలో వీరిదే కీలకపాత్ర
ఇల్లెందు రూరల్, మార్చి 25: ‘చెత్తే కదా అని తేలికగా తీసేయొద్దు.. మనసుంటే మార్గం ఉంటుంది.. వ్యర్థ పదార్థాలను కూడా ఆదాయ వనరులుగా మార్చుకుంటే పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుంది..’ అన్న స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో కంపోస్టు షెడ్లను నిర్మిస్తున్నది. అందుకు ప్రతి పంచాయతీలో ఇద్దరు గ్రీన్ అంబాసిడర్లను నియమించుకోవచ్చని ప్రభుత్వం పాలకవర్గాలకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్లు విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని 480 పంచాయతీల్లో ఉపాధి నిధులతో కంపోస్టు షెడ్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.2.50 లక్షలు వెచ్చించారు. ఇప్పటివరకు 476 పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. జూలూరుపాడు మండలంలో ఒకటి, లక్ష్మీదేవిపల్లి మండలంలో మూడు షెడ్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.11.60 కోట్లు నిధులు విడుదల కాగా రూ.9.91 కోట్లు ఖర్చు చేశారు. ఈ నెలాఖరు లోపు నూరుశాతం నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అధికారులు లక్ష్యాన్ని సాధించే దిశగా పనిచేస్తున్నారు.
ప్రతి పంచాయతీకి ఇద్దరి నియామకం
ప్రస్తుతం పంచాయతీల్లో చెత్త సేకరణకు ప్రత్యేకంగా మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు. గ్రామ జనాభా ఆధారంగా ప్రభుత్వం వీరిని నియమించింది. వీరంతా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తారు. కంపోస్టు షెడ్డు వరకు తరలిస్తుంటారు.వీరేకాక కంపోస్టు షెడ్లలో పనులు చేసేందుకు ప్రత్యేకంగా ప్రతి గ్రామపంచాయతీకి ఇద్దరు చొప్పున నియమించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. వీరికి ‘గ్రీన్ అంబాసిడర్స్’ అని నామకరణం చేశారు. పంచాయతీ నుంచే వీరికి వేతనం చెల్లించాల్సి ఉంటుంది.
చెత్త విభజన ఇలా..
గ్రామాల్లో ఇంటింటా సేకరించిన చెత్తను ట్రాక్టర్లు, ట్రాలీల ద్వారా కంపోస్డు షెడ్డుకు తరలిస్తారు. ఇక్కడ గ్రీన్ అంబాసిడర్లు తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. ముఖ్యంగా పొడి చెత్తలో కొబ్బరి బోండాల వ్యర్థాలను ఒక విభాగంలో నిల్వ చేస్తారు. వాటిని ఎండబెట్టి వంట చెరుకుగా విక్రయిస్తారు . ఆటోలు, ట్రాక్టర్లలో తెచ్చే చెత్తను ప్రతిరోజు చదును చేసి ఎండబెడతారు. వాటి నుంచి వచ్చే అట్టపెట్టెలు, ప్లాస్టిక్ వస్తువులు, సీసాలను వేరు చేసి నిల్వ చేస్తారు. వాటిని నెలకు ఒకసారి విక్రయిస్తారు. చికెన్, మటన్ వ్యర్థాలు, కూరగాయలు.. వంటి తడి చెత్తను కంపోస్టు షెడ్లలో నిల్వ ఉంచుతారు.