న్యూఢిల్లీ : దేశీ, అంతర్జాతీయ విమాన ప్రయాణీకులు చెల్లించే విమానయాన భద్రతా రుసుం (ఏఎస్ఎఫ్) పెరగనుండటంతో వచ్చే నెల నుంచి విమాన చార్జీలు భారం కానున్నాయి. ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణీకులు చెల్లిస్తున్న ఏఎస్ఎఫ్ రూ 160 కాగా, దాన్ని రూ 200కు పెంచనున్నారు. ఇక అంతర్జాతీయ ప్రయాణీకులు చెల్లిస్తున్న ఏఎస్ఎఫ్ 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెంచనున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమలవనుండటంతో అందుకు అనుగుణంగా విమాన చార్జీలకు రెక్కలు రానున్నాయి. గత రెండు నెలలుగా జెట్ ఇంధన ధరలు పెరగడంతో విమాన చార్జీలు ఇప్పటికే 30 శాతం పెరిగిన నేపథ్యంలో తాజాగా మరోసారి చార్జీలు పెరగడంతో గగన విహారం భారం కానుంది. పెరిగిన ఏఎస్ఎఫ్ చార్జీలకు విమానయాన నియంత్రణ సంస్ధ డీజీసీఏ శుక్రవారం నోటిఫై చేసింది. ఇక రెండేండ్లలోపు చిన్నారులు, దౌత్య పాస్పోర్టు కలిగినవారు, ఒకే టికెట్పై కనెక్టింగ్ ఫ్లైట్ ప్రయాణీకులకు ఈ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.