యాదాద్రి, మార్చి 21: దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం అవతార పురుషుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదివారం జగన్మోహిని అవతారంలో భక్తులను కటాక్షించారు. యాదగిరి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే తిరు కల్యాణ వేడుకల్లో స్వామివారిని జగన్మోహినిగా అలంకరించి, పెండ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. పట్టువస్ర్తాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలు, ముత్యాల ఆభరణాలు, వివిధ పుష్పాలతో ఆ హరిహరుడిని ముగ్ధమనోహరంగా అలంకరించారు. పండితులు, రుత్వికులు, యజ్ఞకులు, అర్చకులు ముందు నడువగా, బాలాలయంలో స్వామివారి సేవను ఊరేగించారు. మూల మంత్ర జపాలు, స్తోత్రాలు, మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలతో ఆలయం మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీనారసింహచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు సరేంద్రాచార్యులు, రంగాచార్యులు, వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
దివ్య సుందరంగా ఎదుర్కోలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుడి తిరుకల్యాణానికి ముందుగా జరిపే ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆదివారం రాత్రి శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ముక్కోటి దేవతల సాక్షిగా నరసింహుడి కల్యాణ ముహూర్తాన్ని నిర్ణయించే ఎదుర్కోలు ఘట్టం దివ్య బాలాలయ ఉత్సవ మండపంలో సంప్రదాయరీతిలో వైభవంగా జరిగింది. తొలుత భక్తజనుల జయజయ ధ్వనులు, అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అలంకార నరసింహుడిని అశ్వవాహనంపై బాలాలయం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామి, అమ్మవారిని ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. రెండు బృందాలుగా ఏర్పడిన అధికారులు, రుత్వికులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఇరువైపులా ఆసీనులై..ఆసక్తికర సంభాషణలతో స్వామి, అమ్మవారి తరఫున ఎదుర్కోలు తంతు నిర్వహించారు. లక్ష్మీ నారసింహుడి కల్యాణానికి సోమవారం ఉదయం 10 గంటలకు సుముహూర్తంగా నిర్ణయించారు. తిరు కల్యాణోత్సవంలో భాగంగా వరుడిగా ముస్తాబైన నారసింహుడికి అఖిల భారత అన్నదాన సత్రం ఆధ్వర్యంలో పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు, పూలు, పండ్లు కానుకగా అందజేశారు. ఈ మేరకు సత్రం కమిటీ సభ్యులు బాలాలయంలో ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తికి అందజేశారు. కార్యక్రమంలో అఖిల భారత అన్నదాన సత్రం అధ్యక్షుడు చెరుకూరి యాదగిరి, కార్యనిర్వహక అధ్యక్షుడు మిర్యాల నాగరాజు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, పద్మశాలి సంఘం నాయకులు జోగయ్య, కైరంకొండ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు శ్రీలోగిలి డెవలపర్స్, ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ, మంచినీటి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రికొండపైన ధర్మదర్శనం క్యూ లైన్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎన్. గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలంలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు శ్రీలోగిలి డెవలపర్స్, నమస్తే తెలంగాణ యాజమాన్యం ముందుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీలోగిలి డెవలపర్స్ డైరెక్టర్లు వంటేరు సురేశ్రెడ్డి, వాకిటి మాధవరెడ్డి, ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుకల్యాణ మహోత్సవం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టమైన తిరు కల్యాణ వేడుకలు సోమవారం బాలాలయంలో నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు కొండకింద ఉన్న పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ మండపాన్ని వివిధ రకాల పుష్పాలు, రంగురంగుల విద్యుదీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. భక్తులందరూ కల్యాణ వేడుకలను తిలకించేందుకు ఆలయ ప్రాంగణంలో టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
హాజరుకానున్న ప్రముఖులు
తిరు కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.