ఐరాస, సెప్టెంబర్ 25: ప్రపంచంలో తొలి డీఎన్ఏ కరోనా వ్యాక్సిన్ ‘జైకొవ్-డీ’ని భారత్ అభివృద్ధి చేసిందని, దీన్ని 12 ఏండ్లు నిండిన వారందరికీ ఇవ్వవచ్చని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ‘రండి.. భారత్లో వ్యాక్సిన్లు తయారుచేయండి’ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ తయారీదారులను ఆహ్వానించారు. సేవే ఉత్తమ ధర్మం అని విశ్వసించే భారత్… వ్యాక్సిన్ల అభివృద్ధికి, తయారీకి శక్తివంచన లేకుండా కృషి చేసిందని చెప్పారు. శనివారం ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో మోదీ ప్రసంగించారు. పలు కీలకాంశాలను ఆయన ప్రస్తావించారు. పాకిస్థాన్, చైనా తీరును పరోక్షంగా ఎండగట్టారు. ఉగ్రవాద వ్యాప్తికి ఎవరూ అఫ్గానిస్థాన్ను వాడుకోకుండా చూడాలని పిలుపునిచ్చారు. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి భారత్ గొప్ప ఉదాహరణ అని అన్నారు. రైల్వే స్టేషన్లో టీ అమ్మిన తాను ప్రధానమంత్రిగా ఎదిగానని చెప్పారు. సమితి సాధారణ అసెంబ్లీలో మోదీ ప్రసంగించడం ఇది నాలుగోసారి. కాగా, అమెరికాలో మూడు రోజుల పర్యటనను ముగించుకొని ఆయన తిరుగు పయనమయ్యారు. మోదీకి అమెరికా 157 భారత్ కళాఖండాలు, పురావస్తువులను అప్పగించింది. వాటిలో 7 వేల సంవత్సరాల నాటిది కూడా ఉంది. వాటిని మోదీ తనతో తీసుకువస్తున్నారు.
భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు: బైడెన్
వాషింగ్టన్, సెప్టెంబర్ 25: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించే విషయంలో తాము పూర్తి మద్దతునిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పునరుద్ఘాటించారు. శుక్రవారం వైట్హౌస్లో మోదీ, బైడెన్ సమావేశం అనంతరం ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. ‘శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతున్నది. ఆ దేశం కల సాకారం కావడానికి అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అంతేగాక న్యూక్లియర్ సైప్లెయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత్ ప్రవేశించడానికి కూడా అమెరికా అండగా నిలుస్తుంది’ అని ఆ ప్రకటనలో బైడెన్ పేర్కొన్నారు.