తిరుమల, మే3: లోక కళ్యాణం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ షోడశదిన సుందరకాండ దీక్షను తిరుమలలోని వసంత మండపంలో సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ దీక్ష ఇవాళ్టి నుంచి మే18వ తేదీ వరకు జరుగనున్నది. షోడషాక్షరి మహామంత్రం ప్రకారం మొదటి రోజు రా అనే అక్షరానికి ఉన్న బీజాక్షరాల ప్రకారం సుందరకాండలోని మొదటి సర్గలో 211, రెండో సర్గలో 58 కలిపి మొత్తం 269 శ్లోకాలను పారాయణం చేశారు. అదేవిధంగా బాలరామాయణం, యోగవాశిష్ఠంలోని విషూచిక మహామంత్ర పారాయణం చేశారు. ఇందులో భాగంగా మొదట సంకల్పంతో ప్రారంభించి శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఆ తరువాత 16 మంది ఉపాసకులు శ్లోక పారాయణం చేశారు. మంగళవారం నాడు మూడో సర్గ నుంచి ఆరో సర్గ వరకు మొత్తం 152 శ్లోకాలను పారాయణం చేయనున్నారు.
ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయస్వామివారి అనుగ్రహంతో ప్రపంచంలోని మానవులు ధర్మాని ఆచరిస్తూ, సకల శుభాలను పొందాలని ఆకాంక్షిస్తూ షోడశదిన సుందరకాండ దీక్ష కార్యక్రమాన్ని టిటిడి నిర్వహిస్తోందన్నారు. వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు.