వాషింగ్టన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చోరీకి గురైన, అక్రమంగా రవాణా చేసిన 157 కళాఖండాలు, పురాతన వస్తువులను అమెరికా భారత్కు అప్పగించింది. 10వ శతాబ్దానికి చెందిన ఒకటిన్నర మీటర్ల ఇసుకరాతి రేవంత బాస్ రిలీఫ్ ప్యానెల్ నుండి 12వ శతాబ్దానికి చెందిన 8.5 సెం.మీ పొడవైన అద్భుత కాంస్య నటరాజా విగ్రహం వరకు విభిన్న వస్తువులు ఈ 157 కళాఖండాల జాబితాలో ఉన్నాయి.
ఇందులోని వస్తువులు ఎక్కువగా 11 నుంచి 14వ శతాబ్దానికి చెందినవి. 2000 బీసీ నాటి కాపర్ ఆంత్రోపోమోర్ఫిక్ వస్తువు నుంచి 2వ శతాబ్దానికి చెందిన టెర్రకోట వాజ్ వంటి చారిత్రక పురాతన వస్తువులు ఇందులో ఉన్నాయి. దాదాపు 45 పురాతన వస్తువులు సాధారణ యుగానికి ముందు నాటివి. ఈ కళాఖండాలలో సగం వరకు సాంస్కృతికమైనవి కాగా మిగిలిన సగం హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన బొమ్మలు.
లోహం, రాయి, టెర్రకోటతో తయారైన పలు రకాల పురాతన వస్తువులు అమెరికా అందజేసిన వాటిలో ఉన్నాయి. లక్ష్మీ నారాయణ, బుద్ధ, విష్ణు, శివ పార్వతి, 24వ జైన తీర్థంకరులు, కంకలమూర్తి, బ్రాహ్మీ, నందికేస వంటి ప్రసిద్ధ భంగిమలతో అలంకరించిన కాంస్య విగ్రహాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కాగా, భారతదేశానికి చెందిన పురాతన కళాఖండాలు, వస్తువులను తిరిగి ఇవ్వడం పట్ల ప్రధాని మోదీ అమెరికాను ప్రశంసించారు. దొంగతనం, అక్రమ వ్యాపారం, సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణాను నిరోధించే తమ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సందర్భంగా ప్రకటించారు.