రియో: బ్రెజిల్ దేశంలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఓన్జీవో వేసిన అంచనాలు తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నది. బ్రెజిల్లో కోవిడ్ వల్ల సుమారు 1300 మంది పసిపిల్లలు చనిపోయినట్లు భావిస్తున్నారు. చిన్నారులను కరోనా ఏమీ చేయదని తెలిసినా.. శిశువు మరణాలు ఊహించని రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ.. బ్రెజిల్లో జరుగుతున్న పరిణామాలపై కథనాన్ని రాసింది. దాని ప్రకారం ఆ దేశంలో భారీ సంఖ్యలో కోవిడ్తో చిన్నారులు మృతిచెందినట్లు పేర్కొంటున్నారు. తొలుత చిన్నారుల్లో ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేకున్నా.. చనిపోతున్న సమయంలో కోవిడ్ లక్షణాలు నమోదు అవుతున్నట్లు గుర్తించారు. లక్షణాలు అర్థం కాకపోవడంతో వైద్యులు కూడా సరైన చికిత్స ఇవ్వలేకపోతున్నారు. హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్ తగ్గడం వల్ల చిన్నారుల చనిపోతున్నట్లు అనుమానిస్తున్నారు.
వైటల్ స్ట్రాటజీస్ అనే అంతర్జాతీయ ఎన్జీవో సీనియర్ అడ్వైజర్ ఫాతిమా మారినో బ్రెజిల్ మరణాలపై వివరణ ఇచ్చారు. చిన్నారులకు కరోనా సోకదు అన్న వాదన అవాస్తవం అన్నారు. 2020 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు 9 ఏళ్ల లోపు ఉన్న 852 మంది చిన్నారులు మృతిచెందారు. ఇదే సమయంలో మరో 518 మంది శిశువులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కానీ కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య రెట్టింపుగా ఉంటుందని మారినో అంచనా వేశారు. కోవిడ్ టెస్టింగ్ లేకపోవడం వల్ల సంఖ్య తక్కువ చెబుతున్నట్లు తెలుస్తోందన్నారు. గుర్తు తెలియని శ్వాసకోస వ్యాధుల వల్ల ఏడాది కాలంలో తొమ్మిది ఏళ్ల లోపు ఉన్న 2060 మంది చిన్నారులు, 1302 మంది శిశువులు చనిపోయినట్లు అంచనా వేశారు.