బీర్కూర్/నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/లింగంపేట/ సదాశివనగర్/ బీబీపేట/ ఏప్రిల్ 27: కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని బీర్కూర్ తహసీల్దార్ గణేశ్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ఆయన వీఆర్ఏలకు కరోనా వ్యాధి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం అవగాహన కల్పించారు. ప్రజలు భయానికి గురికాకుండా వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామాల్లో వివరించాలని అన్నారు. గిర్దావర్ శ్రీనివాస్, వీఆర్ఏలు పాల్గొన్నారు. తిమ్మాపూర్లో డాక్టర్ రవిరాజా కరోనా బాధితులకు అవగాహన కల్పించారు. నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామ సర్పంచ్ స్వప్న, ఆరోగ్య కార్యకర్తలు మంగళవారం ఇంటింటికీ వెళ్లి కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పలు కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా బాధితులు హోం ఐసొలేషన్లో ఉండాలని, బయట తిరుగవద్దని ఆర్డీవో శ్రీను సూచించారు. ఎల్లారెడ్డి బల్దియా పరిధిలోని దేవునిపల్లిలో ఆయన కొవిడ్ బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లి పలు సూచనలు చేశారు.
ఏమైనా అవసరం ఉంటే రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి సహాయం చేస్తారని చెప్పారు. ప్రతి రోజూ ఒక మున్సిపల్ వర్కర్, వీఆర్ఏ కొవిడ్ బాధితుల ఇండ్లను సందర్శిస్తారని తెలిపారు. తహసీల్దార్ స్వామి, మున్సిపల్ కమిషనర్ జీవన్, మత్తమాల మెడికల్ ఆఫీసర్ వెంకటస్వామి, సిబ్బంది ఉన్నారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి ఆదేశాల మేరకు కొవిడ్ నివారణ చర్యలపై లింగంపేటలో పోలీసులు ప్రచారం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. కళా బృందం సభ్యులు ప్రభాకర్, రవి, స్థానిక పోలీసులు స్వామి, నరేశ్ తదితరులు ఉన్నారు. సదాశివనగర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో తహసీల్దార్ రవీందర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి పాజిటివ్ వచ్చిన వ్యక్తుల వివరాలను నమోదు చేశారు. కరోనా సోకిన వారు ధైర్యంగా ఉండాలని జడ్పీ వైస్చైర్మన్ పరికి ప్రేమ్కుమార్ సూచించారు. మండలంలోని యాడారం, శివారు రాంరెడ్డిపల్లి గ్రామాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. సర్పంచ్ వెంకట్రావు, తహసీల్దార్ నర్సింహులు, ఏఎస్సై రాములు, ఎంపీటీసీ రవి, కో-ఆప్షన్ సభ్యుడు ఆసిఫ్, ఉపర్పంచ్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.