కరాచీ, జూన్ 7: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 50 మంది మరణించగా సుమారు 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సింధ్ ప్రావిన్స్లోని ఘోట్కి జిల్లా ధార్కిలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. కరాచీ నుంచి సర్గోదకు ప్రయాణికులతో వెళ్తున్న మిల్లత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి బోగీలు మరో ట్రాక్పై పడింది. ఇదే సమయంలో రావల్పిండి నుంచి కరాచీ వెళ్తున్న సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్.. మిల్లత్ బోగీలను ఢీకొట్టింది. సుమారు 13 బోగీలు పట్టాలు తప్పగా.. ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో దాదాపు 8 బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో 50 మంది మరణించారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.