బీజింగ్: చైనా కార్గో షిప్ సిబ్బందిలో పది మందికి ఇండియన్ వేరియంట్ కరోనా సోకింది. మొత్తం 20 మంది సిబ్బందిలో 11 మంది కరోనా బారిన పడినట్లు జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన ఆరోగ్య అధికారులు తెలిపారు. 11 కరోనా కేసులు కూడా ఇతర దేశాల నుంచి వ్యాపించిన వేరియంట్స్కు చెందినవని చెప్పారు. ఇందులో పది కేసులు భారత్కు చెందిన కరోనా వేరియంట్ అని, ఒకరికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించినట్లు ఆ దేశ మీడియా గురువారం పేర్కొంది.
హుయాంగ్ చాయోంగ్ అనే చైనా సరుకు రవాణా ఓడ ఈ ఏడాది ఆరంభంలో చైనాలోని జియామెన్, సింగపూర్, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టులలో ఆగుతూ చివరకు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్టుకు చేరింది. అనంతరం భారత్ నుంచి చైనాకు తిరిగి వెళ్లి మరమ్మతుల కోసం జౌషాన్ జిన్యా షిప్యార్డ్లో నిలిచింది. ఈ సందర్భంగా షిప్లోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఇందులో పది కేసులు భారత్కు చెందిన కరోనా వేరియంట్ అని చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. అయితే అది ఏ రకం వేరియంట్, ఎక్కడ సోకి ఉంటుంది అన్నది స్పష్టం చేయలేదు. మరోవైపు భారత్లో కరోనా సెకండ్ వేవ్కు కారణంగా భావిస్తున్న బి.1.617 వేరియంట్ 17 దేశాల్లో కనిపించినట్లు ఈ నెల 27న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది.