వాషింగ్టన్: అమెరికా జార్జియా రాష్ట్రంలోని ఫోర్ట్ వ్యాలీ స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో శనివారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది మందిపై కాల్పులు జరిగాయని, ఒకరు చనిపోయారని పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఫోర్ట్ వ్యాలీ స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి కాదని జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (జీబీఐ) తెలిపింది. గాయపడిన ఏడుగురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పింది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొంది. కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించడంలో సహాయం చేయాలని జీబీఐ కోరింది.
మరోవైపు ఈ కాల్పుల ఘటన అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా యూనివర్సిటీ క్యాంపస్ను కొంతసేపు మూసివేశారు. అనంతరం విద్యార్థులకు నిబంధనలు సడలించారు. అయితే ఆదివారం జరుగాల్సిన బహిరంగ కార్యక్రమాలను యూనివర్సిటీ రద్దు చేసింది.