వరంగల్ సబర్బన్, ఏప్రిల్ 20 : వరిలో నాట్లు వేయకుండా వెదజల్లే పద్ధతి సత్ఫలితాలనిస్తోంది. అదనులో కూలీలు దొరకక ఇబ్బందులు పడిన సందర్భంలో ప్రత్యామ్నాయం వైపు సాగిన రైతుకు లాభమే జరుగుతోంది. ఫలితంగా కూలీల ఖర్చు మిగలడమే గాక పంట కూడా దండి గా పండుతుండడంతో రైతాంగం ఈ సాగు వైపు ఆసక్తి చూపుతోంది. పొలాల్లో నాట్లు వేయడం ఇప్పుడు పాత తరానికి పరిమితమైంది. ఇప్పుడు ఈ తరం మహిళలెవ రూ నాట్లు వేయడం నేర్చుకోవడం లేదు. దీంతో వరి సాగు చేస్తున్న రైతులకు నాటు కూళ్లు తడిసి మోపెడవుతున్నా యి. ఇదే కాకుండా సకాలంలో నాట్లు పడకపోవడం తో దిగుబడిపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో కొన్ని జిల్లాల్లో వెదజల్లే పద్ధతి వెలుగులోకి వచ్చింది. పత్రికలు, సామాజిక మాధ్యమాల విస్తృతంగా ప్రచారం కావడంతో రైతులు ఈ విధానంపై దృష్టిపెట్టారు.
అర్బన్ జిల్లాలో ఫలించిన ప్రయోగం..
వెదసాగు పద్ధతిలో ప్రయోగం చేసి వరంగల్ అర్బన్ జిల్లా రైతులిద్దరు సక్సెస్ అయ్యారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 600 ఎకరాల్లో సాగవుతున్నప్పటికీ ఈ రైతులు పెద్ద మొత్తంలో సాగుచేయడం మిగతా వారిలో ఆసక్తి రేపింది. ఎల్కతుర్తి మండలం దామెరలో చల్లా రమణారెడ్డి పది ఎకరాల్లో, హసన్పర్తి మండలం మడిపల్లి శివారులో నరేందర్రెడ్డి ఏకంగా 25 ఎకరాల్లో వడ్లను నేరుగా భూమిలో ఎగజల్లి వరిని పండిస్తున్నారు. రమణారెడ్డి ఆర్ఎన్ఆర్ రకం విత్తనాలను చల్లగా ఇప్పుడు పంట ఏపుగా పెరిగింది. కూలీలు వేసిన నాటు కంటే అద్భుతంగా కనిపిస్తోంది. వరిలో ఒక్కో పాదులో పిలకలు ఎక్కువగా వచ్చా యి. వరి కంకులు కూడా పొడవుగా ఉన్నాయి. సుమారు రెండు వందల పైబడి గింజలు ఉన్నాయి. ఇలా ఇద్దరి పొలాల్లో ఎకరానికి 50 బస్తాలు తగ్గకుండా దిగుబడి వచ్చే అవకాశముంది. ఈ ఇద్దరు రైతులు 35 ఎకరాల్లో వెద పద్ధతిలో సాగుచేయడం వల్ల నాటు ఖర్చు రూ.లక్షా 75 వేలు ఆదా అయినట్లేననే మిగతా రైతులు చెబుతున్నారు.
ఒకసారి సూద్దామని ఏసిన..
నాటు వేసేందుకు కూలీల దొరకడం కష్టమైతాంది. అందుకే వెదసాగులో వరి వేసిన. మొదట్లో కొంచెం ఆలోచించిన ఏమైతదో అ ని. ఇప్పుడు పంట మస్తు పండిం ది. కోతకు కూడా అచ్చింది. ఇగ రంది లేదు. నాట్లేయకుండా పంట ఏసిన అని తెలిసి చాలామంది పొలాన్ని చూసిపోతాన్రు. మొదటి ఐదు ఎకరాలల్ల గింజలు చిక్కగ పడ్డా య్. ఆ తర్వాతైదు ఎకరాల్లో పల్సగ చల్లిన. పంట ఎట్లేసుడో తెల్సింది. వచ్చే పంటకు ఇంకా మంచిగ చల్లుత.
నేనొక్కడినే 25 ఎకరాలు చల్లిన..
కరీంనగర్ జిల్లాలో ఉన్న మా బంధువుల పొలం చూసిన నేను కూడా మడిపల్లిలో 25 ఎకరాల్లో వ రివేసిన. గడ్డి మందు చల్తుడు కొం చెం లేటయ్యింది. అయినా పంటకు మాత్రం నష్టం రాలేదు. మంచి దిగుబడి వచ్చేలా ఉంది. ఏ పంట వేసినా కూలీల కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు నేనొక్కడినే 25 ఎకరాల్లో వడ్లు చల్లిన.