టోక్యో: నిర్దేశించిన సమయం కన్నా కార్యాలయం నుంచి రెండు నిమిషాలు ముందుగా వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత విధించారు. క్రమశిక్షణకు మారు పేరైన జపాన్లో ఈ ఘటన జరిగింది. రెండు నిమిషాల ముందుగా కార్యాలయం నుంచి వెళ్లిన పలువురు ప్రభుత్వ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చిబా ప్రిఫెక్చర్లోని ఫనాబాషి సిటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ నెల 10న ప్రకటించింది. 2019 మే నుంచి ఈ ఏడాది జనవరి వరకు నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్లిన 316 కేసులను గుర్తించినట్లు తెలిపింది. ఇందులో ఏడుగురు సిబ్బంది వేతనంలో కోత విధించడంతోపాటు వారికి క్రమశిక్షణ నోటీసులు పంపినట్లు పేర్కొంది.
హాజరు నిర్వహణ బాధ్యత చూసే కౌన్సిలర్ టైమ్ కార్డులో మార్పులు చేసి మోసగించేందుకు ప్రయత్నించారని ఆ ఎడ్యుకేషన్ బోర్డు తెలిపింది. సిబ్బందితోపాటు కౌన్సిలర్ కూడా బస్సును అందుకునేందుకు రెండు నిమిషాలు ముందుగా సాయంత్రం 5:13 గంటలకు కార్యాలయం నుంచి వెళ్లారని, అయితే హాజరుపట్టీలో మాత్రం సాయంత్రం 5:15 గంటలకు వెళ్లినట్లుగా నమోదు చేశారని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కౌన్సిలర్ వేతనంలో పది శాతం మేర మూడు నెలల పాటు ఆ బోర్డు కోత విధించినట్లు జపాన్ టైమ్స్ పేర్కొంది. కౌన్సిలర్తోపాటు ఒక డైరెక్టర్, వృద్ధ మహిళకు నోటీసులు జారీ చేశారని, మరో నలుగురు సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారని వివరించింది.
అయితే ఇంటికి వెళ్లేందుకు సాయంత్రం 5:17 గంటల బస్సు మిస్ అయితే తర్వాత బస్సు కోసం 30 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తున్నదని, అందుకే నిర్ణీత సమయమైన 5:15కు రెండు నిమిషాల ముందుగా 5:13కు కార్యాలయం నుంచి వెళ్లినట్లు ఆ సిబ్బంది బోర్డుకు వివరణ ఇచ్చినట్లు ఆ పత్రిక పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.