వాషింగ్టన్: మనసులోతుల్లో పాదుకొనిపోయిన జాత్యహంకార విషం.. చిన్న, పెద్ద అనే తారతమ్యాన్ని గుర్తించదు. అమెరికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు జోరందుకుంటున్నప్పటికీ పోలీసుల వైఖరి మారడం లేదు. అభం శుభం తెలియని పసివాళ్లు కూడా తెల్లజాతి పోలీసుల దాష్టీకానికి బాధితులుగా మారుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన అగ్రరాజ్యంలో నల్లజాతీయుల చీకటి మౌనవేదనను ఆవిష్కరిస్తున్నది. న్యూయార్క్ రాష్ట్రంలోని రోచెస్టర్ పట్టణంలో ఓ వీధిలో తొమ్మిదేండ్ల వయసున్న ఓ నల్లజాతి బాలిక చేతులకు సంకెళ్లు వేసిన పోలీసులు కార్లో కూర్చోబెట్టారు. ఏం జరుగుతుందో కూడా తెలియని ఆ పసిపాప తండ్రి కోసం రోదిస్తున్నది. ఏడుపు ఆపకపోతే కంట్లో పెప్పర్ స్ప్రే (మిరియాలు, కారం పొడితో చేసిన స్ప్రే) కొడుతామని పోలీసులు బెదిరించారు. భయపడిపోయిన ఆ బాలిక మరింతగా ఏడ్చింది. దీంతో కనికరంలేని ఆ పోలీసులు అన్నంత పని చేశారు. పెప్పర్ స్ప్రే ఘాటుకు కండ్లు మండటం వల్ల ఆ బాలిక ఆర్తనాదాలు మిన్నంటాయి. తాను చిన్న పిల్లనని, వదిలేయమని పోలీసులను వేడుకున్నది. అయినా ఆ తెల్లజాతి అధికారుల గుండె ఎంతమాత్రం కరుగలేదు. మరి ఆ బాలిక ఏదైనా పెద్ద నేరం చేసి ఉంటుంది అని అనుకోవచ్చు. అలాంటిదేమీ లేదు. గత కొంతకాలంగా సదరు బాలిక కలతతో ఉంటుంది. పాప ఇలా ఉండటంపై ఆమె తల్లిదండ్రులకు గొడవ జరిగింది. దీంతో భర్త వద్దని వారించినా బాలిక తల్లి జనవరి 29న పోలీసులకు ఫోన్ చేసింది. తన బిడ్డకు మానసిక వైద్యం అందించాలని విజ్ఞప్తి చేసింది. బాధిత బాలిక నల్ల జాతీయురాలని తెలుసుకున్న పోలీసులు మానసిక వైద్యం అందించడం మానేసి.. ఇలా ప్రవర్తించారు. అమెరికాలో తెల్లజాతీయుల పిల్లలతో పోలిస్తే నల్లజాతీయుల పిల్లలు పోలీసుల కాల్పుల్లో ఆరురెట్లు ఎక్కువగా మరణిస్తున్నట్టు ఓ అధ్యయనం పేర్కొంది.