కేపీహెచ్బీ కాలనీ, జూలై 14 : వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్ల డీసీలు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వానకాలంలో వరదనీటి ముంపుతో ఏర్పడే సమస్యలను ముందస్తుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాలాల్లో పూడికతీత పనులను నిత్యం పర్యవేక్షించాలని ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాలాల కల్వర్టు దగ్గర వరదనీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చెత్తా చెదారాలను తొలగించాలన్నారు.
రెండు మీటర్లకంటే ఎక్కువ వెడల్పు ఉన్న నాలాలన్నింటికీ మెస్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న నాలాల దగ్గర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, నాలాల్లో తొలగించిన వ్యర్థాలను తొలగించడం కోసం వాహనాల రాకకోసం ర్యాంపులు నిర్మించి గేట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాలతో ఎదురయ్యే సమస్యలన్నింటినీ ఎదుర్కొనేలా భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని దేవాలయాల రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయాల వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ శంకర్ నాయక్, డీసీలు రవికుమార్, ప్రశాంతి, డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.