ఒకప్పుడు చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. రెండు మాటలు… నాలుగు పాటలు అన్నట్లుగా ఉండేది. ఖాళీ సమయం దొరికితే చాలు సంగీతం వింటూ.. ఎంతో హుషారుగా గడిపేవారు. ప్రధానంగా ప్రయాణంలో అయితే ఏకంగా చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సంగీతం వింటూ సాగిపోయేవారే అధికంగా కనిపించేది. కాలం మారింది. ప్రజల అభిరుచులు మారాయి. సంగీతం కన్నా ఎక్కువగా స్మార్ట్ఫోన్లో సోష ల్ మీడియాను వీక్షిస్తున్నారు. తాజాగా, మెట్రో రైలులో నిత్యం ప్రయాణం చేసే వారి పట్ల ఈ అంశంపై సర్వే నిర్వహించారు. మెట్రో రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో మీరు స్మార్ట్ ఫోన్లో ఏం చేస్తుంటారు? అణడిగితే 52.7 శాతం మంది సోషల్ మీడియాను చూస్తామని, 47.3 శాతం మంది సంగీతం వింటామని చెప్పారు. అత్యాధునిక ప్రజా రవాణాగా మారిన మెట్రో సంస్థ సోషల్ మీడియా ద్వారా నిరంతరం ప్రయాణికులను పలకరిస్తూ ఉంటుంది.
ఇంటర్నెట్ వేగం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు కంప్యూటర్లు, ల్యాప్టాప్లో ఉండే వేగం, ఇప్పుడు స్మార్ట్ఫోన్లలోనూ ఉంటోంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని టెలీకాం కంపెనీలు 4జీ నెట్ వర్క్ను విస్తరించడంతో ఇంటర్నెట్ వేగం పెరిగి సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో రకరకాల అంశాలను వీక్షిస్తున్నారు. ప్రధానంగా వాట్సాప్లో పోస్టులు, స్టేటస్లు, డీపీలు నిరంతరం చూసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజు వారీగా ఏం చేసినా దాన్ని వాట్సాప్లో షేర్ చేస్తూ, దానికి వచ్చే స్పందనలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొందరైతే ఎవరు ఎలాంటి స్టేటస్, డీపీ పెట్టుకున్నారనే దానిపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నారు.