న్యూఢిల్లీ: కరోనాపై జాతీయ ప్రణాళికను మంగళవారం కోర్టుకు సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. మహమ్మారి సంక్షోభ సమయంలో అత్యవసర వస్తువులు, సేవల పంపిణీకి సంబంధించి తన ప్రణాళికలో వివరించింది. మొత్తం 200 పేజీల అఫిడవిట్ను సుప్రీంకు కేంద్రం సమర్పించింది. అయితే ఇందులో రోజువారీ తీసుకుంటున్న చర్యల గురించి వివరాలు లేవు. ప్రస్తుతం ఉన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ చట్టబద్ధ సంస్థలు, ఇతరులు సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునే విధంగా నిర్ణయాధికారాన్ని వారికే అప్పగించినట్లు అఫిడవిట్లో కేంద్రం స్పష్టం చేసింది.
దేశంలో కరోనా సంక్షోభాన్ని సుమోటాగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దీనిపై జాతీయ ప్రణాళిక సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్తోపాటు ఇతర అత్యవసర మందులు, వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని, పంపిణీని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అఫిడవిట్లో కేంద్రం తెలిపింది.