అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే మార్గం యోగా, ప్రాణాయామం. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని కొంతైన నియంత్రించేందుకు, దుష్ప్రభావాలను అడ్డుకునేందుకు అవి ఆయుధాలు. ముఖ్యంగా కరోనా సోకితే ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందనే భయం ఎక్కువగా ఉంది.. యోగాలోని కొన్ని ఆసనాలతో ఆ ఇబ్బందిని అధిగమించొచ్చని నిపుణులు చెబుతున్నారు. శ్వాస మీద ధ్యాస ఉంచే ప్రక్రియ ఆరోగ్యాన్ని కాపాడుతుందని వారు వివరిస్తున్నారు. కరోనా బాధితులు దవాఖానలు, హోం ఐసోలేషన్లో ప్రాణాయామం చేస్తూ ధైర్యంగా ఉంటున్నారు. కొన్ని రకాల ప్రాణాయామాలతో పాటు యోగా సాధన చేస్తే శ్వాస సమస్యలు పరిష్కారం కావడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా నుంచి బయటపడటం సులభతరం అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ‘గైడ్ లైన్స్ ఫర్ యోగా ప్రాక్టీషనర్స్ ఫర్ కొవిడ్-19’ పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది.
కరోనా వైరస్ మానవుని శ్వాసక్రియకు విఘాతం కల్గిస్తుండగా.. ప్రాణాయామం మాత్రం ఆ సమస్యను అధిగమించేలా చేస్తున్నది. శ్వాస సజావుగా అందేలా ప్రాణాయామం, శారీరక దృఢత్వానికి ఆసనాలు, మానసిక ప్రశాంతత కోసం సూర్య నమస్కారాలు అత్యుత్తమ మార్గాలని పలువురు నిపుణులు చెబుతున్నారు. మనసును శరీరాన్ని అనుసంధానం చేయడంలో ప్రాణాయామం కీలకం. రక్త ప్రసరణ సాఫీగా సాగేలా దోహదపడుతుంది. మనసులో చెలరేగే అలజడిని తగ్గిస్తుంది. సుఖ నిద్రకు ఉపయోగపడుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చాలా మంది యోగా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఈ మహమ్మారి నుంచి బయటపడిన వారు సైతం ఇది యోగా ద్వారానే సాధ్యమైందని చెబుతుండటం విశేషం. మరోవైపు యోగా సాధన, ప్రాణామాయం నేర్చుకునేందుకు వెబ్సైట్లు, యాప్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో యోగా చేయడం తప్పనిసరైంది. ఒత్తిడిని దూరం చేసేందుకు యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాల ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం యోగసనాలు వేస్తున్నా. ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నా.
సమతుల ఆహారం తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు నిరంతరం యోగా చేస్తూ ఉంటే వైరస్లు మనల్ని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉండకపోవచ్చు. ప్రస్తుతం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇలాంటి సమయాల్లో మనసు శాంతపరుచుకోవడానికి ప్రాణాయామం సహాయపడుతుంది. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు పది నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి. పాజిటివ్ వారిని హోం ఐసొలేషన్లోనే ఉంచుతూ ఫోన్లో సూచనలు, సలహాలు ఇస్తూ ప్రాణాయామం చేయిస్తున్నాం. – డి. చంద్రిక, యోగా నిపుణులు
ప్రాణాయామం, యోగాసనాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కేవలం శ్వాసకు సంబంధించిన ప్రాణాయామం, ఆసనాలు ఎక్కువగా చేయిస్తున్నాం. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రత్యేక శిక్షణకుడి ద్వారా ఎక్కువగా సూక్ష్మ వ్యాయామం నిర్వహిస్తున్నాం. కరోనా నుంచి కోలుకున్నాక శారీరక దృఢత్వాన్ని పెంచే ఆసనాలు వేయాలి. – శొంఠి భవానీ, సూపరిటెండెంట్, నేచర్ క్యూర్ హాస్పిటల్