బరిలోకి దిగారంటే చిచ్చర పిడుగుల్లా చెలరేగిపోతారు. చిట్టి చేతులతో గట్టి పట్టుపట్టి జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. యూసుఫ్గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రెజ్లింగ్లో శిక్షణ పొందుతున్న నగరానికి చెందిన ముగ్గురు చిన్నారులు మేటి రెజ్లర్లుగా రూపుదిద్దుకుంటున్నారు. జాతీయ రెజ్లింగ్ క్రీడాకారుడు, కోచ్ క్యాతం శ్రీకాంత్యాదవ్ నాయకత్వంలో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ ఏడాది నగరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలతో మురిపించిన లచిత, రోషిణి, శ్రావణిలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కర్నాటకలో జరిగిన నేషనల్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శనలతో అబ్బురపరిచారు. రెజ్లింగ్ 45 కేజీల విభాగంలో లచిత, 48 కేజీల విభాగంలో సాయి రోషిణి, 53 కేజీల విభాగంలో శ్రావణి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చారు.
నగరంలోని యూసుఫ్గూడకు చెందిన అజ్జు.. కుస్తీ క్రీడాకారుడు. తన వారసత్వంగా తన ఇద్దరు కూతుళ్లు శ్రావణి (15), లోచిత (13)లకు కేవీబీఆర్ స్టేడియంలో గత 5 సంవత్సరాలుగా రెజ్లింగ్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. అక్కా చెల్లెళ్లు ఇద్దరు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. రెండు బంగారు పతకాలను సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు వెళ్లడం ఆనందంగా ఉందని అజ్జు సంతోషం వ్యక్తం చేశాడు.
యూసుఫ్గూడలోని ఇందిరానగర్కు చెందిన శ్రీనివాస్ (అథ్లెటిక్స్) మాజీ క్రీడాకారుడు. పదవ తరగతి చదువుతున్న తన కూతురు సాయిరోషిణి చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తుండటంతో గత మూడేండ్లుగా కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో రెజ్లింగ్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఇటీవల రోషిణి రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించింది. అంతేకాకుండా తన కూతురు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని శ్రీనివాస్ చెప్పాడు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు జాతీయ స్థాయి పథకాలే లక్ష్యంగా తర్ఫీదు పొందుతున్నారు. ఇప్పటికే ముగ్గురు చిన్నారులు రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించారు. ఈ అర్హతతో జాతీయ స్థాయి పోటీలలో ఉత్తమ ప్రదర్శన చేశారు. ఇకపై జాతీయ స్థాయి పతకాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.- శ్రీకాంత్ యాదవ్, కోచ్