హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి కృషిచేసి, ప్రోత్సహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి బుధవారం ప్రగతిభవన్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇసుకతో వేసిన రామప్ప చిత్రపటాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి మంత్రి కేటీఆర్కు అందించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావటానికి అనేక పర్యాయాలు ఢిల్లీకి మంత్రుల బృందాన్ని తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. మంత్రి కేటీఆర్ను కలిసిన వారిలో టీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్రెడ్డి, జడ్పీటీసీ వంశీచందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు జి.కేశవరావు ఉన్నారు.
రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం, కీలకమైన డాక్యుమెంటరీ ఫిల్మ్ (వీడియో) చిత్రీకరణకు తమ స్టూడియోను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని చిత్రకళా స్టూడియో సంస్థ తెలిపింది. చిత్రీకరణతోపాటు యునిసెఫ్ అధికారిక భాషల్లో వాయిస్ఓవర్ డబ్బింగ్ కూడా జతచేసినట్టు పేర్కొంది. తమ సంస్థ రూపొందించిన వీడియోను యునెస్కో ప్రతినిధులకు చూపించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కాకతీయ హెరిటెజ్ ట్రస్ట్, పర్యాటకశాఖలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తమ సంస్థ రామప్ప ప్రత్యేకతలు, చారిత్రాత్మక విశేషాలపై చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్లలో వీడియో రూపొందించినట్టు వివరించింది.