సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ) : దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థ.. ‘వర్కింగ్ పీపుల్స్ చార్టర్’ గురువారం రామాంతపూర్లోని మోంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్లో ‘ఇండియా లేబర్ లైన్’ హైదరాబాద్ శాఖను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న రంగాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న 20 సంస్థల భాగస్వామ్యంతో డబ్ల్యూపీసీ సంస్థ కలిసి పనిచేస్తుంది. కార్మికుల కష్టాలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది. వారి హక్కుల రక్షణకు కృషి చేయడానికి ఈ సంస్థ లేబర్ లైన్ పేరుతో ఉచిత ఫోన్ సర్వీస్ను ప్రారంభించింది.
కార్మికులు ఎవరైనా ఫోన్ చేసి వారికి జరిగిన కష్టాలను పంచుకుంటే న్యాయం సాయంతో పాటు చట్టపరమైన సహాయం చేయడానికి ఈ సర్వీస్ను ప్రారంభించినట్టు డబ్ల్యూపీసీ మెంబర్ వర్ఘేషీ తెకనాథ్ తెలిపారు. కార్మికుల గృహాలు, కార్మిక ప్రమాణాలు, పనిచేసే హక్కు, వెట్టి చాకిరీ తదితర విషయాలపై దృష్టిపెడుతామని ఆయన పేర్కొన్నారు.
కార్మికులు 18008339020 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుపొచ్చని అన్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో టెలీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో బాలల హక్కుల కార్యకర్త డాక్టర్, శాంత సిన్హా, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గంగాధర్, షేక్ సలావుద్దిన్, రవి, నరేందర్ రెడ్డి, బిలాల్, రమా మేల్కోటి తదితరులు పాల్గొన్నారు.