హయత్నగర్ : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆర్టీసీ హయత్నగర్ డిపో-1కు చెందిన కండక్టర్ రవీందర్ కుటుంబానికి తోటి కార్మికులు రూ.1.50 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. హయత్నగర్ డిపోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం లో కార్మికులు రవీందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కండక్టర్ రవీందర్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని కుటుంబాన్ని పోషించుకుంటూ అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కండక్టర్ రవీందర్ మృతిచెందినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రఘు, ఎస్టిఐ రమాదేవి, శంకరయ్య, నరేష్ కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.